Woman Commits Suicide: భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను కష్టపడి పెంచింది. కుమార్తెకు పెళ్లి చేసి పంపించగా.. కుమారుడు కూడా ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్న కానుకలు తీస్కురాకుండా వచ్చిన ఆ కోడలు.. తాను సంపాదించే జీతాన్ని కూడా పుట్టింటికే పంపుతోందని హైదరబాద్ కు చెంది ఓ ఓ అత్త ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఎలా, ఎప్పుడు జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


హైదరాబాద్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ ముస్తఫా ప్లాజాలో ఉండే మెరాజ్ సుల్తానా(48) భర్త మఖ్దూం అహ్మద్ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె ఫర్హానా నాజ్, కుమారుడు ముజఫర్ ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు అమెరికా సంబధం చూసి పెళ్లి చేసి పంపించింది. అయితే మూడు నెలల క్రితం కుమారుడు ముజఫర్.. కాలాపత్తర్ కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అందులోనూ కట్నకానుకలు ఏమీ తీస్కురాకపోవడంతో కుమారుడితో వాదించింది. 


దీంతో కొడుకు ముజఫర్.. ఆమె కట్నకానుకలు ఏం తీస్కురాకపోయినా.. ఆమె ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. నెలనెలా వచ్చే జీతమంతా నీకే ఇస్తుందని చెప్పాడు. దీంతో ఆమె కాస్త చల్లబడింది. అయితే కోడలు మాత్రం నెలనెలా తనకు వచ్చే జీతాన్ని అత్తగారికి కాకుండా.. తన పుట్టింటికి అంటే తల్లిదండ్రులకు పంపిస్తోంది. విషయం తెలుసుకున్న సుల్తానా కుమారుడు, కోడల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. విషయం తెలుసుకున్న ఫర్హానా అమెరికా నుంచి కొత్త దంపతులకు ఫోన్ చేసి సర్ది చెప్పింది. వారం రోజుల పాటు మీ పుట్టింట్లోనే ఉండమని.. తాను అమ్మకు నచ్చజెబుతానని వివరించింది. ఇదే విషయమై తల్లికి ఈనెల 11వ తేదీన అమెరికా నుంచి ఫర్హానా ఫోన్ చేసింది. 


అయితే తల్లి ఎంతకూ ఫోన్ లేపకపోవడంతో తమ్ముడికి ఫోన్ చేసి తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. అదేరోజు రాత్రి ఏడున్నరకు బంధువులతో కలిసి ఇంటికెల్లి తలుపు తట్టాడు. అయినా తల్లి తలుపు తీయకపోవడంతో వెనక నుంచి వెళ్లి వంట గదిలో చూడగా.. కాలిన గాయాలతో తల్లి మృతి చెంది ఉంది. వెంటనే విషయాన్ని అమెరికాలో ఉన్న అక్కతో పాటు పోలీసులకు కూడా తెలియజేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆమె కావాలనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


ఇటీవలే దుర్గం చెరువులో దూకిన యువతి..


హైదరాబాద్‌లోని మాదాపూర్ దర్గం చెరువు కేబుల్ వంతెన పైనుంచి దూకి ఇటీవలే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ అబ్ధుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)కు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. అయితే కొన్నాళ్లపాటు హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలు అయ్యాయి. దీంతో 8 నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పుట్టింటికి వెళ్లిపోయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. 


భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటి నుంచి స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఒత్తిడిని తట్టుకోలేక చాలా ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం దుర్గంచెరువు వద్దకు వెళ్లి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ బృందం 24 గంటలపాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.