KSRTC bus dashcam exposed Murder Plan: కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన ఒక హత్యాయత్నం కేసు సినిమా స్టోరీని తలపిస్తోంది. భార్యను వదిలించుకోవడానికి భర్త వేసిన రూ. 40 లక్షల స్కెచ్‌ను ఒక బస్సు డ్యాష్‌క్యామ్  బట్టబయలు చేసింది. 

Continues below advertisement

రూ. 40 లక్షల సుపారీ - పక్కా ప్లాన్ 

ధార్వాడ్ జిల్లాకు చెందిన కిరణ్ అనే వ్యక్తి తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ఒక పక్కా ప్లాన్ వేశాడు. నేరుగా చంపితే దొరికిపోతామన్న భయంతో, దీనిని ఒక  రోడ్డు ప్రమాదం లా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ. 40 లక్షల సుపారీ  ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం, జనవరి 25న కిరణ్ తన భార్యతో కలిసి టూవీలర్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి ఒక వాహనంతో బలంగా ఢీకొట్టి ఆమెను చంపేయాలి.

Continues below advertisement

ఘటన జరిగిన తీరు                            

కిరణ్ తన భార్యను బైక్‌పై తీసుకువెళుతుండగా, ముందే అనుకున్నట్లుగా ఒక కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య తీవ్రంగా గాయపడింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు సాధారణ ప్రమాదమే అనుకున్నారు. కిరణ్ కూడా అమాయకుడిలా నటిస్తూ భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే, వారి టైం బాగోలేదు.  సరిగ్గా అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న ఒక కర్ణాటక ఆర్టీసీ  బస్సు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసింది.

 పోలీసులకు చిక్కిన క్లూ                          

ప్రమాదం జరిగిన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు సిసిటివి విజువల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్లిన KSRTC బస్సులోని డ్యాష్‌క్యామ్ ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా వాహనం ఢీకొంటే వెంటనే ఆగడమో లేదా వేరే వైపు తిప్పడమో చేస్తారు. కానీ ఆ కారు కావాలనే లక్ష్యంగా చేసుకుని బైక్‌ను ఢీకొట్టడం, కారులో ఉన్న వారు కిరణ్‌తో సైగలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించాయి.

బట్టబయలైన కుట్ర                        

ఈ వీడియో ఆధారంగా కిరణ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. భార్యను చంపేందుకు తాను ఇచ్చిన సుపారీ వివరాలను, ఇతర నిందితుల పేర్లను కిరణ్ వెల్లడించాడు. ఆ కారు డ్రైవర్ మరియు ఇతర స్నేహితులకు రూ. 40 లక్షలు ఇస్తానని ఆశ చూపినట్లు అంగీకరించాడు. కేవలం ఒక బస్సు కెమెరా లేకపోతే ఇది ఒక ప్రమాదంగానే మిగిలిపోయేది.  ప్రస్తుతం కిరణ్‌తో పాటు అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీ సహాయంతో ఒక నేరగాడు ఎలా దొరికిపోయాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.