కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుట్కా మాఫియా చెల‌రేగిపోతోంది. జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను కేంద్రంగా చేసుకొని ర‌వాణా సాగిస్తూ పోలీసుల‌కు కూడా స‌వాల్ చేస్తోంది. ఇంతలా పేట్రేగిపోతున్న ఈ మాఫియాకు ఖాకీల సాయం ఉందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 


గుట్టుగా గుట్కా


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలు నిరంత‌రం కొనసాగుతున్నాయి. గుట్కా మత్తులో యువత భవిష్యత్‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. చట్టాల్లోని లొసగులతోపాటుగా కొంద‌రు ఖాకీలు కూడా సహకారం అందిస్తుండ‌టంతో జిల్లాల్లో యథేచ్ఛగా గుట్కా దందా సాగుతుంద‌నే విమ‌ర్శలు ఉన్నాయి. విచ్చలవిడిగా బస్తాల కొద్ది గుట్కా ప్యాకెట్లును రెండు జిల్లాల‌కు త‌ర‌లిస్తున్నారు. అయినా సంబంధిత శాఖల అధికారులు ప‌ట్టిప‌ట్టన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  


నిఘా కళ్లు కప్పి రవాణా


నిత్యం ఏదో ఒక చోట గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నవి తక్కువగా ఉండ‌టం, గుట్కా నిల్వలు భారీగా ఉండ‌టం వెనుక పెద్దల హ‌స్తం కూడా లేక‌పోలేద‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఏపీలో గుట్కా విక్రయాలపై నిషేధం ఉంది. అయితే పక్క రాష్ట్రం కర్ణాటకలో గుట్కా విక్రయాలకు అనుమతులున్నాయి. దీంతో అక్కడి నుంచి జిల్లాకు చెందిన గుట్కా మాఫియా పెద్ద మొత్తంలోనే గుట్కాను తీసుకొచ్చి కిరాణా, పాన్‌షాపులకు అమ్ముతోంది. ఈ వ్యాపారం నెలలో కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


గతంలో గుట్కా వ్యాపారాల పై పోలీసులు ప్రత్యేకంగా దాడులు నిర్వహించేవారు. ఇప్పుడు క‌రోనా ప‌రిస్థితులు త‌రువాత గుట్కా విక్రయాలు పై పోలీసులు అంత‌గా నిఘా పెట్టటం లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. గుట్కాపై పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో, మాఫియా రెచ్చిపోతోంద‌ని అంటున్నారు స్థానికులు. గుట్కా విక్రయాలకు సంబంధించి కేసులు నమోదు అవుతున్నప్పటికీ వాటి అమ్మకాలు మాత్రం త‌గ్గటం లేదు. 


ఆదివారం ఊహించని రీతిలో గుట్కా 


ఆదివారం సాయంత్రం మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజలో రెండు వేర్వేరు దుకాణాలపై మంగళగిరి రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 6వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇది ఊహించ‌లేదు. వేరొక ఫిర్యాదుపై పోలీసులకు స‌మాచారం అంద‌టంతో సాధార‌ణ త‌న‌ఖీల‌కు వ‌చ్చిన ఖాకీల‌కు ఊహించిన విధంగా గుట్కా క‌నిపించ‌టంతో షాకయ్యారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇంకా ఎన్ని వెలుగులోకి వ‌స్తాయ‌నేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 


రాష్ట్రం స‌రిహ‌ద్దుల నుంచి జిల్లాల స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ...


గుట్కా మాఫియా కేవ‌లం జిల్లాను టార్గెట్ చేసుకొని వ్యాపారాలు సాగిస్తోంది. ప్రధానంగా క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి స‌ర‌కు దిగుమ‌తి చేసుకొని, ఏపీలోని జిల్లాల స‌రిహ‌ద్దుల‌కు స‌రకును పంపుతున్నారు. దీని వ‌ల‌న రెండు జిల్లాల‌కు చెందిన పోలీసులు స‌రిహ‌ద్దుల‌ను సాకుగా చూపి సైడ‌యిపోతున్నారు. ఇందుకు అక్కడ ఉన్న ఖాకీల‌కు న‌జ‌రానాలు కూడా అందుతున్నాయ‌ని అంటున్నారు. 


జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల మీదుగా గుట్కా ప్యాకెట్లను జిల్లా కేంద్రంతోపాటు, వివిధ పట్టణాలకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి గ్రామాలకు తరలిస్తున్నారు. గుట్కాను రవాణా చేసే మాఫియా ర‌వాణా స‌మ‌యంలో చాలా జాగ్రత్తల‌ను పాటిస్తోంది. ఎక్కువ‌గా ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను వినియోగిస్తున్నారు. పోలీసుల కంటబడకుండా తీసుకువస్తున్నారు. కిరాణా, పాన్‌షాపులకు వీటిని తరలించి విక్రయాలు సాగిస్తున్నారు. 


మూడు రూపాయల గుట్కా 70 రూపాయలకు


కొందరు మాఫియాగా మారి దీన్ని వృత్తిగా మార్చుకుని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 3రూపాయ‌ల‌కు దొరికే గుట్కా ప్యాకెట్‌ను ఇక్కడ అవసరాన్ని బట్టి 70, 80 రూపాయ‌ల‌కు కూడా విక్రయిస్తున్నారు. మాఫియా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తోంది. మాఫియాలోని కొందరు అప్పుడ‌ప్పుడు పోలీసుల‌కు చిక్కినా బెయిల్ కూడా ఈజీగా పొందే అవ‌కాశం ఉంది. అరెస్ట్ క‌న్నా ముందు పోలీసులు అదుపులోకి తీసుకోగానే, మాఫియాలోని పెద్దలు స్థానిక కోర్ట్‌లో బెయిల్ పిటిష‌న్‌ల‌ను కూడా దాఖ‌లు చేస్తున్నారు. అలా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రుస‌టి రోజే తిరిగి వ్యాపారాలు స్టార్ట్ చేసేస్తున్నారు.