మద్యం మత్తులో ఓ చిన్నారిని కన్న తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మంగళగిరి నగర పరిధి నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చనిపోయిన చిన్నారి వయసు రెండేళ్లు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గోపి - మౌనిక అనే భార్యభర్తలు నవులూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గోపి బేల్దారు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మద్య కాలంలో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి రోజూ భార్యతో గొడవ పడే వాడు. ఈ రోజు కూడా పూటుగా  మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య మౌనికతో గొడవకు దిగాడు. ఇద్దరి మద్య ‌వాగ్వివాదం జరిగింది. 


పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోపి పట్టరాని ఆగ్రహంతో  తన పెద్ద కూతురు లక్ష్మీ పద్మను ఎత్తి నేలకేసి‌ కొట్టాడు. బండ తలకు బలంగా తగలడంతో ఆ పసి పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన చూసిన స్థానికులు ఒక్క సారిగా కిరాతక తండ్రి గోపీపై దాడి ‌చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి స్థానికుల నుంచి గోపీని రక్షించి స్టేషన్‌ కు తీసుకు వెళ్ళారు. పాప మృత దేహాన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడిని, అతణ్ని ఉరితీయాలని స్థానికులు ఆవేశంతో ఊగిపోయారు.


అనకాపల్లిలో లవర్స్ ఆత్మహత్యాయత్నం



అనకాపల్లి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరిలో యువతి చనిపోగా, యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అచ్చుతాపురం మండలం ఎస్‌కే‌ఆర్ లాడ్జిలో థర్డ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 303లో ఘటన చోటుచేసుకుంది. యువతి యువకుల్లో యువతి మెడపై కత్తి గాయం ఉండడంతో యువకుడు ఆమెపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యువకుడు శరీరంపై కూడా కత్తిపోట్లు ఉన్నాయి. యువతిని హతమార్చిన వెంటనే తనను తాను పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, కొనవూపిరితో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.