శ్రీకాళహస్తి- బుచ్చినాయుడు కండ్రిగ రోడ్ కి ఆనుకొని ఉన్న రామచంద్ర మిషన్ వద్ద భారీగా సుమారు రూ. 9,00,000 విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకుని 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి పి. పరమేశ్వర రెడ్డి వెల్లడించారు.


తిరుపతి జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణ, రవాణా, అమ్మకం అరికట్టడం కోసం జిల్లా పరిధిలో ఎప్పటికప్పుడు మాధక ద్రవ్యాల రవాణా, అమ్మకం సేవించడంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల శ్రీకాళహస్తి - బుచ్చినాయుడు కండ్రిగ రోడ్ కి ఆనుకొని ఉన్న రామచంద్ర మిషన్ కి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో, కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉండగా, తొట్టంబేడు మండల రెవిన్యూ, శ్రీకాళహస్తి సబ్-డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది సహాయంతో తిరుపతి జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 17 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలను అదుపులోకి తీసుకుని  విచారణ చేపట్టారు. 


వారిలో ప్రధానంగా, నెల్లూరు జిల్లా రాపూరు మండలంకి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి, తిరుపతిలో సుమారు 8 సంవత్సరాలుగా జీప్ డ్రైవర్ గా ఉంటూ, చాలా మందితో పరిచయం కలిగి ఉండి, గతంలో ఒక సారి తొట్టంబేడు పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అతనికి ఉన్న పరిచయాలతో శ్రీకాళహస్తి, వెంకటగిరి, రేణిగుంట, చిత్తూరు, తిరుపతి టౌన్, చెన్నైతో పాటు కర్నాటక లోని కోలార్ తదితర ప్రదేశాల్లో చాలా మందికి గంజాయి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను విశాఖపట్నం, ఇతర ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్సు లో ప్రయాణం చేసి, మరికొందరు వ్యక్తులతో పాటు, ఇంకా కొంత మందికి గంజాయి రవాణా చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే వాడని తేలింది.  


ఎప్పటిలాగే విశాఖపట్నం నుంచి బస్సులో గంజాయి తీసుకొని వచ్చి శ్రీకాళహస్తిలో కొందరు వ్యక్తులకు అమ్ముతుండగా వారిని పట్టుకొని వారి వద్ద నుండి మొత్తం 23 పాకెట్ల లోని సుమారు 22 కేజీల గంజాయి, నగదు మొత్తం 13,300/- స్వాధీనం చేసుకోని శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా చేసిన ప్రధాన ముద్దాయిలను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కల్లపల్లి నాగేంద్ర, శ్రీకాళహస్తికి చెందిన పైపూరి వేణుగోపాల్, మంగయ్య, చిచ్చు కార్తీక్, కోబాక బాలచంగమ్మ, చిత్తూరుకు చెందిన భాస్కర్, తిరుపతికి చెందిన ఇమామి, ఆవల హరి, యశ్వంత్, సాయి ప్రతాప్ రెడ్డి, జగదీష్, పందిటి రాజమ్మ, షేక్ బాబు, చిన్నస్వామి సుమన్, రోషి రెడ్డి, మేడూరి గౌతమ్, పెట్టే గిరి, దిలీప్ కుమార్, ముత్తుకూరు యువరాజు, తమిళనాడుకు చెందిన తిరుపతి వినయ్ కుమార్, గుణ శరవణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. 
8 మందిపై పీడీ యాక్ట్..
ఈ కేసులో అక్రమ రవాణాకు పాల్పడిన 08 మంది పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకే పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. అవసరమైతే వీరిని జిల్లా బహిష్కరణ కూడా చేస్తామన్నారు. ఎవరైనా ఈ గంజాయిని అక్రమ రవాణా చేసిన, కొన్న, వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం ఇక్కడ ఎక్కడ కూడా గంజా అన్నది ఉండకూడదు 100% అరికట్టాలనే ఉద్దేశంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు‌ చెప్పారు.


తిరుపతి జిల్లాకు గంజాయి‌ ఎక్కడి‌ నుండి వస్తుందంటే...???
తిరుపతి జిల్లాలో అక్కడక్కడ గంజాయి సరఫరా జరుగుతుందని, ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన కూలీలు అక్కడక్కడ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి ఎక్కడ నుంచి వస్తోంది, ఎలా వస్తోంది అనే విషయాలపై తెలుసుకొని వాటిని అరికట్టడానికి SEB అడిషనల్ యస్.పి రాజేంద్ర, L&O అడిషనల్ యస్.పి కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలోకి ఎక్కడ నుండి వస్తోంది, ఎవరెవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాత జిల్లా వ్యాప్తంగా విసృతంగా వాహన తనికీలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను అరకు నుంచి గంజాయి తెప్పించుకొని పరిసర ప్రాంతాలలో సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కేరళకు సైతం గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. 


ఇంకా చాలా మంది ఉన్నారని, విచారణ జరుగుతుందని, వీరి వద్ద నుంచి 22 కేజీల గంజాయితో పాటు 20 మందిని అరెస్టు చేశామని, ఇందులో పాత నేరస్తులు కూడా ఉన్నారని, వీరి పైన పి.డి యాక్ట్ ఓపెన్ చేస్తామన్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గంజాయి అన్నది నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. రవాణా కానీ, అమ్మడం కానీ, వాడడం కానీ ఈ మూడిటిని నివారించడానికి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ యొక్క గంజాయి, మాదకద్రవ్యాలు వాడడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే విద్యా సంస్థల సమీపంలో మాదకద్రవ్యాల విక్రయాలు, వాడకం అసలు జరగకుండా ఉండటానికి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి వివరించారు. ఇలా చేయడం ద్వారా కొంత మేర గంజాయిని అరికట్టవచ్చు. కాలేజీ యాజమాన్యం మరియు తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి అది వారి బాధ్యతన్నారు.


ఎవరైనా గంజాయి సేవిస్తుంటే ఈ‌నెంబర్ కి ఫోన్ చేయండి...
ఎవరైనా గంజాయి అక్రమ రవాణా గురించి, విక్రయిస్తున్న వాళ్ల గురించి సమాచారం ఇవ్వాలనుకుంటే వారు 14500 నెంబర్ కు లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వవచ్చు, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.