Youngsters Missing In Godavari: కాకినాడ జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. గోదావరిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చారు. అందరూ ఈత కొట్టేందుకు గోదావరిలో దిగారు. వారిలో ఒకరు లోతు ప్రాంతానికి వెళ్లి మునిగిపోగా అతన్ని రక్షించేందుకు వెళ్లి మరో ముగ్గురు మునిగిపోయారు. మిగతా నలుగురు ఒడ్డుకు చేరుకుని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


గల్లంతైన విద్యార్థులను గుర్తించి పోలీసులు .
తాళ్లరేవు మండలం గోపులంక పుష్కరఘాట్ వద్ద గోదావరిలో ఈతకు దిగి గల్లంతైన నలుగురిని పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారు తణుకు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. యానాం విహార యాత్రకు వచ్చి, గోదావరి తీరంలో ఈతకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు స్నేహితులు తెలిపారు. గల్లంతైన నలుగురి కోసం కోరంగి పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు.


గల్లంతైన యువకులు వీరే
1. హనుమకొండ కార్తీక్(21)
2. మద్దిని ఫణీంద్ర గణేష్(21)
3. పెండ్యాల బాలాజీ(21)
4. తిరుమల రావు రవితేజ(21)


గరువారం ఆర్కే బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విశాఖ ఆర్కే బీచ్‌లో గత గురువారం ఇద్దరు విద్యార్థుల గల్లంతయ్యారు. ఎన్నారై కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు సరదాగా గడిపేందుకు గురువారం బీచ్‌కు వచ్చారు. అక్కడ ఈత కొడుతూ ఇద్దరు గల్లంతయ్యారు.