Forced Religious Conversion | కాకినాడ జగన్నాథపురానికి చెందిన బాలరమ్య, మటన్ వ్యాపారి గౌస్ మొహిద్దీన్ను ప్రేమించి వివాహం చేసుకోగా.. మరో ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తూ మత మార్పిడి చేస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు కోరుతూ, తల్లి సమక్షంలో తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించింది.
అసలేం జరిగిందంటే..
కాకినాడ జగన్నాథపురానికి చెందిన శిరివూరి బాలరమ్య డిగ్రీ చదువుతున్న సమయంలో మటన్ వ్యాపారం చేసే గౌస్ మొహిద్దీన్తో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రియుడు గౌస్ను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయిన 2 నెలల నుంచే మొహిద్దీన్ వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను బలవంతంగా మతం మార్పించి షేక్ ఉమల్ ఖైర్గా పేరు మార్చడమే కాకుండా, ఒక కుమార్తె పుట్టిన తర్వాత కూడా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడు. స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ పెట్టినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
తన కళ్ల ముందే మొహిద్దీన్ మరో ఐదారుగురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడని బాలరమ్య ఆరోపించారు. ఆ మహిళల్ని కూడా ఉచ్చులోకి లాగి మతమార్పిడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే ఏడుగురిని పెళ్లి చేసుకున్నా తనను అడిగే దిక్కు లేదంటూ తీవ్రంగా కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వెళ్లినా కత్తులతో బెదిరించేవాడని తెలిపారు. మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి మీ రెండో అమ్మాయిని కూడా ఇలాగే వేధిస్తా అంటూ హెచ్చరించి వారిని సైతం భయాందోళనకు గురిచేశాడు. గతంలో ఓ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ఇతనిపై రౌడీషీట్ తెరిచి 20 రోజులు రిమాండ్కు తరలించారు. ఇటీవల మరో ఎస్సీ యువతిని వేధించిన కేసులో ప్రస్తుతం మొహిద్దీన్ జైలులో ఉండటంతో, ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చినట్లు బాధితురాలు బాలరమ్య తెలిపారు.
మత మార్పిడి ఆరోపణలు వచ్చిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటన మరువక ముందే జిల్లాలో అలాంటి మరో కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్తో కలిసి సోమవారం రోజు బాలరమ్య కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ను కలిసి ఫిర్యాదు చేశారు. మొహిద్దీన్ నుండి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్పీ ఆఫీసు ఎదుటే తన తల్లి చేతుల మీదుగా నుదుటన బొట్టు పెట్టించుకుని తాను తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు బాలరమ్య ప్రకటించారు. ఈ బలవంతపు మతమార్పిడులపై లోతైన దర్యాప్తు జరపాలని, లవ్ జిహాద్ తరహా కేసులపై పోలీసులు ఫోకస్ చేయాలని బీజేపీ నేత రామ్కుమార్ పోలీసులను డిమాండ్ చేశారు.
