Secunderabad: సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక అదనపు డీజీ సంజయ్ కుమార్ తెలిపారు. పొగ వల్లే ఎనిమిది మంది చనిపోయారని వివరించారు. అయితే ప్రమాద సమయంలో కిటీకీల నుంచి దూకి గాయాలపాలైన కొందరు, పొగ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన మరికొందకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొందరు కోలుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


నిప్పు రాకపోవడం వల్ల యాక్టివేట్ కాని స్ప్రింకర్లు.. 
రూబీఫ్రైడ్ భవన నిర్మాణానికి కేవలం నాలుగు అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఉందని... కానీ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం మరో అంతుస్తును నిర్మించిందని డీజీ సంజయ్ కుమార్ వెల్లడించారు. అంతే కాకుండా సెల్లార్ లో కేవలం పార్కింగ్ కు మాత్రమే అనుమతి ఉండగా.. అక్కడ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయలకు షోరూం కూడా నిర్వహిస్తున్నారన్నారు. ఈ భవనంలో స్ప్రింకర్లు ఉన్నప్పటికీ పని చేయలేదని.. అందుకు కారణాన్ని కూడా వివరించారు. స్ప్రింకర్లు కేవలం మంటలు చెలరేగినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయని. కానీ నిన్న నిప్పుకు బదులుగా దట్టమైన పొగ వ్యాపించిందని తెలిపారు. దీంతో స్ప్రింకర్లు యాక్టివేట్ కాలేదన్నారు. ఈ లాడ్జికి ఒకటే మార్గం ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే జనాలు బయటకు రాలేకపోయారని తెలిపారు. అయితే కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలోనే పలువురు గాయాల పాలయ్యారు. మరికొందరు బయటకు రాలేక లోపల ఉన్న పొగకు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. 


అసలేం జరిగిందంటే..? 
సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. బైక్ షోరూమ్ లో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసి పడ్డాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి లాడ్జిలో ఉన్నవారు చనిపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని తెలిపారు. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. రూబీ హోటల్ లో మొత్తం నాలుగు ఫోర్లలో 23 రూమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు ఫోర్లలోని వారు చనిపోయారని సీపీ తెలిపారు. ఆరుగురి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని యశోధ ఆసుపత్రికి తరలించారు. మంటలు వ్యాపించినట్లు హోటల్ పై నుంచి దూకిన వారెవరూ చనిపోలేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా 
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘‘బిల్డింగ్ సెల్లర్ ని మిస్ యూస్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. 8 మంది స్మోక్ ద్వారానే చనిపోయారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.