Father Killed His Son In Medak: కొందరు యువత ఇటీవల బెట్టింగ్ లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా తమ కుటుంబాలను సైతం కష్టాల్లోకి నెడుతున్నారు. తాజాగా, బెట్టింగ్ కు బానిసైన ఓ కొడుకు రూ.2 కోట్లు పోగొట్టాడు. ఈ క్రమంలో తండ్రి అతన్ని రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లిలో (Bagirathpally) ముకేశ్ కుమార్ (28) అనే యువకుడు బెట్టింగ్, ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇవన్నీ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ కొడుకును పలుమార్లు హెచ్చరించాడు. ఇప్పటివరకూ ముకేశ్ బెట్టింగ్ లో దాదాపు రూ.2 కోట్లు పోగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై తండ్రి దాడి చేశాడు. ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలైన ముకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ముకేశ్ చేగుంట మండలం మాల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మేడ్చల్ లో ఉన్న ఇళ్లు, ప్లాట్స్ బెట్టింగ్ కారణంగా అమ్మేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Voter Slip Download: మీకు ఓటరు స్లిప్పు అందలేదా? ఇలా చేస్తే సింపుల్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు