ప్రియుడితో కలిసి నాటకమాడి పెళ్లయి ఏడాది తిరగకుండానే భర్తను హత్య చేయించింది ఓ వివాహిత. అంతటితో ఆగక అతి తెలివిగా భర్తను దారి దోపిడీ దొంగలు హత్య చేశారంటూ ఓ రేంజ్ లో నాటకం మాడింది. భర్త శవాన్ని చూస్తూ బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది ఆ మహానటి. తీరా అనుమానం వచ్చి ఆరా తీసిన పోలీసులుకు అసలు విషయం తెలియడంతో ఆమెతో పాటు ప్రియుడ్ని కూడా కటకటాల వెనక్కు పంపారు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తో వివాహం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం, బత్తలపురం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడైన దామోదరానికి పుంగనూరు నియోజకవర్గం, పెనుగొలక గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతితో గత ఏడాది పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు తన తండ్రి చేసే  పాల వ్యాపారంలో పాల వ్యాన్ డ్రైవర్గా పని చేసిన నాగిరెడ్డిపల్లికు చెందిన గంగరాజుతో అక్రమ సంబంధం ఉంది. గంగరాజుకి అప్పటికే పెళ్లయి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. కానీ తన యజమాని కూతురుని ట్రాప్ చేసి ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అనురాధ తండ్రి ఆమెకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. తండ్రి మాటను ఎదురించకుండా.. ప్రియుడితో ప్రేమాయణం నడుపుతూనే పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని ఓకే చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేస్తున్న దామోదరంతో గత ఏడాది వివాహం ఘనంగా జరిపించారు. ఉద్యోగం చేస్తున్న భర్త, మంచిగా చూసుకునే అత్త మామలు ఉన్నా, ప్రియుడు గంగరాజుతో ఉన్న అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్త ఇంట్లో లేని‌ సమయంలో అత్తమామలకు తెలియకుండా గంగరాజుతో ఫోన్లో‌ మాట్లాడుతూ ఉండేది. ఆమె బలహీనతను సొమ్ము చేసుకున్న గంగరాజు తరచు ఆమె దగ్గర డబ్బు నగలు అడిగి తీసుకునని తన అవసరాలకు వాడుకునేవాడు. 
నగలు పుట్టింట్లో ఉన్నాయని మాయ మాటలు
ప్రియుడు గంగరాజు మాయలో పడి భర్తను దూరం పెడుతూ వచ్చింది ఆ వివాహిత. ఆమెను ఎప్పటి‌ లాగానే తనకు డబ్బు అవసరం ఉందని మరోసారి కోరాడు గంగరాజు. దీంతో అనురాధ అత్తమామలు పెట్టిన బంగారు నెక్లెస్, చంద్రహారం తాకట్టు పెట్టుకోమని గంగరాజుకు ఇచ్చింది. అయితే కొన్ని రోజులకే దామోదరం పుంగనూరులో భూమి కొనుగోలు కోసం డబ్బు తక్కువ అయిందని తాము పెట్టిన నగలను తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వాలని భార్యను అడిగాడు దామోదరం. పుట్టింట్లో నగలు మరిచిపోయానని భర్తకు అబద్ధం చెప్పింది. భార్యను పుట్టింటికి తీసుకు వెళతానని నగలు తీసుకువద్దమని భర్త దామోదరం చెప్పాడు. దీంతో ఆమె ఆలోచనలో పడింది. భర్తకు నగలు పుట్టింట్లో లేవని, ప్రియుడికి ఇచ్చేసిన విషయం ఎలా దాచి ఉంచాలో అర్ధం కాలేదు. 
ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
ప్రియుడు గంగరాజుకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది వివాహిత. తమ అక్రమ‌ సంబంధానికి అడ్డుగా ఉన్న దామోదరంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా దామోదరంను చంపేందుకు పక్కా ప్లాన్ ను తయారు చేశారు. అక్టోబర్ 31వ తేదీన  కర్ణాటక సరిహద్దులోని భార్య స్వగ్రామమైన పెనుగొలకకు భర్త దామోదరం బైక్ పై ఆమెను తీసుకు వెళ్ళాడు.‌ నగలు తీసుకువచ్చానంటూ ఓ డబ్బాను భర్తకు అనురాధ చూపించింది. తిరుగు ప్రయాణంలో స్థానికంగా జరిగే వివాహ వేడుక చూసి వెళ్దామని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన దామోదరం భార్య పన్నిన కుట్రను పసిగట్టలేక పోయాడు. వివాహ వేడుక పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలో షాపింగ్ అంటూ దామోదరంను ఇటు అటు తిప్పింది. 


చీకటి పడ్డాక పెద్దపంజాణి మండలం, గొల్లపల్లి గ్రామ సమీపంలో నాగలగుంటచెరువు కట్టపైకు బైక్ రాగానే, చెరువు కట్టపైనే కాపు కాసిన గంగరాజు ఒక్కసారిగా కారం పొడిని దామోదరం పైకి చల్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడుస్తూ దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే దామోదరం మృతి చెందాడు. ఎవరికి అనుమానం రాకుండా భర్త రక్తాన్ని తాను ఒళ్ళంతా పూసుకుంది భార్య. అలాగే చేతిపై ఆమెకు గంగరాజు చిన్నపాటి గాయం చేసి పరారయ్యాడు. ప్రియుడు పరార్ అవ్వగానే అరుపులతో కేకలతో అత్తవారింటికి వెళ్లి భర్తతో కలిసి తాను బైక్ పై వస్తుండగా ముగ్గురు దోపిడీ దొంగలు దాడి చేశారని, వారిని అడ్డుకోబోయిన దామోదరంను పొడిచి చంపి నగలతో పారిపోయారని దొంగ కన్నీళ్లు కార్చింది. అత్తమామలను, బంధువులను గ్రామస్తులను హత్య చేసిన ప్రాంతానికి తీసుకు వెళ్లి భర్త సమయం ముందు బోరును ఏడ్చింది. 


ఆమె కుట్రను గ్రహించలేని అత్తమామలు బోరున ఏడుస్తున్న కోడల్ని ఓదార్చారు. దామోదరం తండ్రి పెద్ద రెడ్డప్ప ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా భావించి అతడి భార్యను విచారించారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పేసింది. ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో రెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన పోలీసులు ఏ1 నిందితుడుగా గంగరాజుతో పాటు ఏ2 నిందితురాలుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దామోదరం భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.