Chittoor Crime: చిన్న చిన్న విషయాలకు తోటి వ్యక్తులపై కక్షలు పెంచుకుని ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు కొందరు ఆవేశపరులు. తాజాగా ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన RRR సినిమా వీక్షించేందుకు ఇంటి‌ నుండి బయటకు వచ్చిన ఓ యువకుడు రెండు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోయే సరికి పోలీసులను ఆశ్రయించారు యువకుడి కుటుంబ సభ్యులు. పోలీసుల ఎంట్రీతో యువకుడు హత్యకు గురైనట్లు తెలిసింది. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు యువకుడి హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. యువకుడి హత్య కేసులో ఆధారాలు మాయం చేసేందుకు నిందితులు చేసిన పని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే!


వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, కేవీ పల్లె మండలం, నూతన కాలువ వడ్డిపల్లెకు చెందిన రెడ్డి కుమార్ (21) ఈ నెల 25 తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు తిరుపతికి వచ్చాడు. తిరుపతిలో గ్రూప్స్ థియేటర్స్ లో ముందుగానే సినిమా టిక్కెట్టు కూడా పొంది కొందరు స్నేహితులతో కలిసి సినిమా వీక్షించాడు. సినిమా పూర్తి అయిన తరువాత రెడ్డికుమార్ తిరిగి గ్రామానికి బయలుదేరాడు. కానీ, రెండు రోజులు గడుస్తున్నా రెడ్డి కుమార్ ఇంటికి వెళ్లలేదు. ఫోన్ కూడా స్వీచాఫ్ కావడంతో అనుమానం వచ్చిన రెడ్డికుమార్ తల్లిదండ్రులు తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. రెడ్డికుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. 


అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువతిని రెడ్డికుమార్ ప్రేమించడమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో యువకుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూపీ లాగడం మొదలు పెట్టారు పోలీసులు. తిరుపతికి వచ్చిన రెడ్డికుమార్ చివరి సారిగా యువతితో ఫోన్ మాట్లాడి అటుతరువాత కనిపించకుండా పోయాడు.. దీంతో మరింత లోతుగా దర్యాప్తు సాగించారు. యువతితో పోలీసులు మాట్లాడగా ఆమె తన బావ ప్రతాప్ తో పాటుగా, మరి కొందరిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో యువతి బావ ప్రతాప్, మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయగా.. రెడ్డికుమార్ ను హత్య చేసి కాల్చి వేసినట్లు నిందుతులు వెల్లడించారు.


దీంతో నిందితుల సహాయంతో రెడ్డికుమార్ ను కాల్చి వేసిన ఘటన స్థలాన్ని గుర్తించారు. తానంటే నచ్చని యువతి, రెడ్డికుమార్ తో సన్నిహితంగా ఉంటుందని, ఈ కారణంగానే పలుమార్లు రెడ్డికుమార్ ను హెచ్చరించానని కానీ అందుకు యువకుడు వినక పోవడంతోనే, అడ్డు తొలగించుకుని, ఆమెను తాను పెళ్ళి చేసుకోవాలనే ఈ హత్య చేసినట్లు నిందితుడు ప్రతాప్ పోలీసుల విచారణలో చెప్పాడు. అంతేకాకుండా గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రతాప్ కు బావ అయిన సుబ్బయ్యను హతమార్చి సహజ మరణంగా ప్రతాప్ చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. 


ఈ హత్యోదంతంతో గతంలో సుబ్బయ్య హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. దీంతో రెడ్డి కుమార్ హత్య కేసులో నిందితులైన నాగేంద్ర కుమార్, ప్రతాప్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.