ఎన్టీఆర్‌  జిల్లా నందిగామలో నమోదైన యాసిడ్‌ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు ఉన్న వ్యాధి గురించి దాచాడని ప్రియురాలు పక్కన పెడితే... తనతో మాట్లాడటం లేదని ప్రియుడు యాసిడ్ దాడి చేశారు. 


ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళపై ఆదివారం యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో బాధితురాలితోపాటు పక్కనే పడుకొని ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


నెల్లూరుకు చెందిన మణిసింగ్‌ ఆటో నడుపుతూ జీవిసాగిస్తున్నాడు. ఆయనకు ఓ సందర్భంలో నందిగామ ప్రాంతానికి చెందిన మహిళ పరిచయం అయింది. ఇద్దరి మధ్య కొన్ని రోజులు స్నేహం కొనసాగింది. తర్వాత అది కాస్తే వివాహేతర సంబంధంగా మారింది. అలా ఇద్దరు సహజీవం సాగిస్తూ వచ్చారు. 


సహజీవనం చేస్తున్న మణిసింగ్‌ తరచూ నెల్లూరు నుంచి నందిగామ వచ్చేవాడు. మహిళ ఇంట్లో ఉండి వెళ్లేవాడు. ఇటీవల కాలంలో మణిసింగ్ టీబీ వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సహజీవనం చేస్తున్న మహిళ వద్ద దాచి పెట్టాడు. అయినా సరే మణిసింగ్‌కు టీబీ ఉన్న విషయాన్ని తెలుసుకుంది. 


టీబీ ఉన్న సంగతి మణిసింగ్ దాచి పెట్టాడని గ్రహించిన మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. మాట్లాడటం మానేసింది. ఆయనతో సంబంధాన్ని కట్‌ చేయడం ప్రారంభించింది. ఫోన్ చేసినా కట్ చేసింది. ఇంటి దగ్గర లేనని చెబుతూ వచ్చింది. తర్వాతర్వాత ఫోన్‌లో కూడా మాట్లాడటం మానేసింది. 


సహజీవనం చేస్తున్న మహిళ ఒక్కసారి మాట్లాడటం మానేయడం మణిసింగ్‌కు కోపం తెప్పింది. ఆవేశంతో యాసిడ్‌ కొనుగోలు చేసి ఆమెపై దాడి చేశాడు. ఇంటిలో నిద్రిస్తుండగా యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిచారు. 


మహిళా కమిషన్ సీరియస్
నందిగామలో మహిళపై యాసిడ్ దాడి విషయాన్ని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆసుపత్రిలో బాదితురాలిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. పట్టపగలు యథేచ్చగా యాసిడ్‌తో ఇంటిలోకి వచ్చి దాడికి పాల్పడటం దారుణమన్నారు. బాధిత మహిళకు అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. భర్త చనిపోతే కొడుకుతో కలిసి జీవినం సాగిస్తోందని.. నిందితుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని అన్నారు. ప్రస్తుతం బాధితురాలి  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వివరించారు.


అపరిచితులతో పరిచయాలు వద్దని హెచ్చరిక
అపరిచిత వ్యక్తులతో పరిచయం ప్రమాదమన్నారు వాసిరెడ్డి పద్మ. ఎవరో తెలియకుండా దగ్గర కావద్దని, బ్యాక్ గ్రౌండ్‌, ఆ వ్యక్తుల నడవడికను గమనించాలని సూచించారు. ఘటనకు బాధ్యుడైన నిందితుడికి నెల రోజుల్లో శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు దిశా యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం ఉందని గుర్తు చేసారు.