Bhopal Crime News: పెళ్లి విషయంలో అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని కన్నతల్లినే హతమార్చాడు ఓ కుమారుడు. క్రికెట్ బ్యాటుతో తలపై కొట్టి చంపేశాడు. దీని గురించి పోలీసులు వివరాలు వెల్లడించారు. 


మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అబ్దుల్ అహ్మద్ ఫర్హాన్ (32) తన తల్లి అస్మా ఫరూఖ్, అన్నా వదినలతో కలిసి నివసిస్తున్నాడు. అబ్దుల్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. తనకు పెళ్లి చేయాలంటూ తరచూ తన తల్లి అస్మాతో గొడవపడుతుండేవాడు. అయితే ఆమె అందుకు నిరాకరించేది. ముందు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడి తర్వాత పెళ్లి ఆలోచన చేయాలని అహ్మద్ కు చెబుతుండేది. ఈ విషయమై తరచూ తల్లీకొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. 


క్రికెట్ బ్యాటుతో కొట్టి


అసలు తనకు పెళ్లి చేయడం తల్లికి ఇష్టం లేదని అనుమానం పెంచుకున్నాడు అహ్మద్. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఆవేశంలో అహ్మద్.. అస్మాన్ ను క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్ తో కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. కాసేపటికి ఇంటికి వచ్చిన అన్నా వదినలకు అమ్మ మేడమీద నుంచి పడి చనిపోయిందని అబద్ధం చెప్పాడు. 


దెయ్యంలా అడ్డుపడుతోందని


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి అబ్దుల్ తీరు అనుమానాస్పదంగా అనిపించి అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిజం అంగీకరించాడు. అబ్దుల్ తరచుగా ఇంటర్నెట్ లో దెయ్యాలు, మంత్రగత్తెల వీడియోలు చూస్తుండేవాడు. ఈ క్రమంలో తల్లి తన పెళ్లికి దెయ్యంలా అడ్డుపడుతోందని భావించి కడతేర్చాడు. అని పోలీసులు వివరించారు. 


భర్తను కిడ్నాప్ చేశారని నాటకం.. మరిదిపై అనుమానం నటన!


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త చంద్ర వీర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు తన మరిది అంటే తన భర్త సోదరుడే కిడ్నాప్ చేశాడేమో అంటూ పోలీసుల ముందు వాపోయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ అప్పుడు ఆధారాలు లభించలేదు. ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు పోలీసుల కంటబడ్డాయి. వాటి ఆధారంగానే కేసును మరోసారి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రవీర్ భార్య.. ఇంటి పక్కనే ఉన్న అరుణ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం నడిపింది. అయితే ఈ విషయం చంద్రవీర్ కు తెలియగా.. అతను మందలించాడు. మానుకోమని ఇద్దరినీ హెచ్చరించాడు. 


తుపాకీతో కాల్చి చంపి, గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి..!


తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. అతడిని ఎలాగైనా సరే అడ్డు తొలగించికోవాలనుకొని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇద్దరూ కలసి అతడిని చంపాలనుకున్నారు. ప్లాన్ ప్రకారమే మహిళ, ఆమె ప్రియుడు అరుణ్ కలిసి 2018లోనే చంద్రవీర్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం అరుణ్ ఇంట్లోనే ఏడడుగుల గుంతలో పాతి పెట్టారు. పైన సిమెంట్ ఫ్లోరింగ్ వేసి, అరుణ్ ఎప్పటిలాగే నివసించాడు. తాజాగా పోలీసులు గుంతను తవ్వి.. అస్థి పంజరాన్ని వెలికి తీశారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే కొన్ని రోజుల ముందుగానే గొయ్యిని సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు గానూ.. దాన్ని లోతుగా తవ్వినట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి ఎస్పీ దీక్షా శర్మ తెలిపారు.