Anantapur Crime News: అనంతపురం జిల్లా డీ హీరేహాల్‌లో ఒక డెడ్‌ బాడీ ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూస్తే డెడ్‌బాడీ కాలిపోయి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరో? అక్కడ ఎందుకు చంపేశారో క్లూలు లేవు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేవు. చుట్టుపక్కల మిస్సింగ్ కేసులు కూడా రిజిస్టర్ కాలేదు. కానీ కేవలం జంధ్యం, సగం కాలిన పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌తో కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. కానీ వారు మూగ చెవిటి వాళ్లు కావడంతో నిర్దారించుకోవడానికి టైం తీసుకున్నారు.     

Continues below advertisement

క్లూలెస్‌గా డెడ్‌బాడీ కేసు 

జూన్ 23వ తేదీని అనంతపురం జిల్లా పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. డీహీరేహాల్ మండలంలోని పులకుర్తిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పారు. వెంటనే పోలీసులు స్పాట్‌కు వచ్చారు. చనిపోయింది మగ వ్యక్తి అని మాత్రమే గుర్తు పట్టారు. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అక్కడ అతన్ని కాల్చేశారు అనేది మాత్రం క్లూలెస్‌గా మారింది. అయితే స్పాట్‌లో మాత్రం ఒక జంధ్యం, సంగ కాలిన కన్నడ పేపర్‌, అప్పడాల ప్యాకెట్‌ దొరికింది. 

మూడు వస్తువులతో కేసు దర్యాప్తు

ఈ మూడింటి ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. అప్పడాల ప్యాకెట్‌ చెన్నైకు చెందింది తెలిసింది. అక్కడికి వెళ్లి ఆరా తీస్తే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వివరాలు తెలిశాయి. ఆయన్ని ప్రశ్నిస్తే బళ్లారికి చెందిన గురురాజారావుగా తేల్చారు. మూగ, చెవిటి వ్యక్తి అయిన ఇతను అప్పడాలు అమ్ముకొని జీవించే వాడని తేలింది. ఆయన కనిపించడం లేదని కూడా గుర్తించారు. దీంతో చనిపోయింది గురురాజారావుగా కన్ఫామ్‌ చేసుకున్నారు. 

Continues below advertisement

డబ్బు డ్రా చేసి పోలీసులకు చిక్కిన నిందితులు

చనిపోయింది ఎవరో గుర్తించిన పోలీసులు అసలు నిందితుల ఎవరూ అని ఆరా తీయడం మొదలు పెట్టారు. మృతుడితో పరిచయం ఉన్న వారంతా కూడా చెవిటి, మూగవారే. కాబట్టి వారిని అనుమానించలేదు. కేసు ఎలా ముందుకు వెళ్తుందని పోలీసులు డైలమాలో పడ్డారు. ఇంతలో మృతుడి బ్యాంక్ నుంచి కొంత డబ్బు డ్రా అయ్యింది. 

ఇదే కేసులో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా అయిన సంగతి తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వారితో మాట్లాడారు. వెంటనే వాళ్లు ఏ ఏటీఎంలో డబ్బులు డ్రా అయ్యాయో వివరాలు చెప్పారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందజేశారు. దాన్ని చూసిన పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ డబ్బులు డ్రా చేసింది ఇద్దరు వ్యక్తులు బసవరాజు, కోటేష్‌. వారిద్దరు కూడా మూగ, చెవిటి వాళ్లే. 

దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడానికి సైగల భాష నిపుణుల సాయం తీసుకున్నారు. వారితో కేసులో పురోగతి సాధించారు. వారిద్దరే ఈ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. గురురాజారావు వద్ద డబ్బులు ఉన్నాయని భావించిన వీళ్లిద్దరు అతన్ని నమ్మించి మోసం చేశారు. ఫుల్‌గా మద్యం తాగించి కళ్లల్లో కారం కొట్టి హత్య చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డీహీరేల్‌ వద్ద డెడ్‌బాడీని తగలబెట్టేశారు.