Shamirpet pedda cheruvu | హైదరాబాద్: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. శామీర్ పేట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శామీర్ పేట్ పెద్ద చెరువులో ఒక మహిళ, ఒక పాప చనిపోయి ఉన్నారని సమాచారం అందగా, వెంటనే వెళ్లి పరిశీలించారు. మరికంటి భానుప్రియ(28), ఆమె  కూతురు దక్షిత(3) పెద్ద చెరువులో పడి చనిపోయారని గుర్తించారు. పొరపాటున చెరువులో పడి చనిపోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్యనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


కాగా, రెండు రోజుల క్రితం తన భార్య, కొడుకు, కూతురు కనిపించడం లేదని భానుప్రియ భర్త స్వామి సిద్దిపేట జిల్లా లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ములుగు పోలీస్ స్టేషన్లో తన భార్య, కొడుకు వేదాన్ష్, కూతురు దక్షత కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళ , ఒక పాప మృతదేహాలు లభ్యం కాగా,  ఇంకా బాబు దేవాన్ష్ ఆచూకీ తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట్ పోలీసులు తెలిపారు.


Also Read: కోల్‌కత్తా ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ