ఏపీలో వాలంటీర్‌ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. అధికారం అడ్డు పెట్టుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా వాటిపై ఏమాత్రం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దృష్టి సారించడం లేదు. కఠినమైన శిక్షలు విధించడం కానీ , అరెస్ట్ లు చేయడం కానీ చేయకపోయేసరికి మరింతగా రెచ్చిపోతున్నారు. ఆధార్ పరిశీలన , ఓటర్ కార్డు పరిశీలన ఇలా ఏదో ఒకటి చెపుతూ ఇళ్లలోకి వెళ్లి యువతులను ప్రేమ పేరుతో లోబర్చుకోవడం , వివాహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు.


తాజాగా ఏలూరు జిల్లా లో ఓ వివాహితను ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన ఓ మహిళను లోబర్చుకున్న గర్భవతిని చేశాడు వాలంటీర్ మండిగ సత్య గణేష్‌. ఈ విషయం బయటకొస్తుందని నెల క్రితమే ఆ వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించారు. అప్పటి వరకు వివాహం చేసుకుంటానని చెప్పిన గణేష్‌.. తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీరా గర్భవతి అయ్యాక.. పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలవరం పోలీసులను ఆశ్రయించింది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, వాలంటీర్‌ వ్యవస్థపై ఓవైపు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. 


ఇటీవల కొన్ని సంఘటనలు


ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్‌ ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వెళ్లి.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు వాలంటీర్ నీలాపు శివకుమార్. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆధార్‌ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు.. ఆ తల్లిదండ్రుల దగ్గర వాయిపోయిందట విద్యార్థిని.. దీంతో.. వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేశాడో గ్రామ వలంటీర్. ఆమెను లోబరుచుకుని గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. శింగనమల మండలం నాగులగుడ్డం తండాకి చెందిన గ్రామ వలంటీర్ కిరణ్ నాయక్‌కి కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన యువతితో పరిచయమైంది. అనంతపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండడంతో ఆమె అక్కడే ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది.


ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు. తీరా ఆమె గర్భం దాల్చడంతో విషయం ఇంట్లో తెలిసిపోయింది. వెంటనే యువతి తల్లిదండ్రులు కిరణ్ పేరెంట్స్‌ని సంప్రదించడంతో పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు. అయితే కొద్దికాలం గడిచిన తర్వాత ఆమెతో తనకు సంబంధం లేదంటూ కిరణ్ అడ్డం తిరిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.