Kerala Crime News: కేరళలో డబుల్ మర్డర్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దల మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాథలుగా మిగిలారు. అయితే ఈ డబుల్ మర్డర్ ఘటనపై తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందే ఆ కుటుంబంలోని మహిళను చంపిన నిందితుడు జైలుకు వెళ్లొచ్చి.. ఆ మహిళ భర్త, ఆమె అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు.
పక్కింట్లో ఉండే వ్యక్తే..కేరళలోని పలక్కడ్ జిల్లా నెన్మారా పట్టణంలో సోమవారం వెలుగుచూసిన జంట హత్యలు కలకలం రేపాయి. సుధాకరణ్(55), అతడి తల్లి లక్ష్మి(75) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. పక్కింట్లో ఉండే చెంతమార(58) అనే వ్యక్తే వారిని హత్య చసి పరారయ్యాడని స్థానికులు ఆరోపించారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అతడి కోసం జల్లెడపట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మంత్రాలు చేయడంతో తన భార్య వెళ్లిపోయిందనే పగతో..నిందితుడు చెంతమార, అతడు హత్య చేసిన మృతుల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. అయితే సుధాకరణ్ కుటుంబం మంత్రాలు చేస్తోందని చెంతమారకు అనుమానం ఉండేది. వారి మంత్రాల కారణంగానే తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిందని నమ్మేవాడు. దీంతో సుధాకరణ్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. 2019లో సుధాకరణ్ భార్య సుజితను హత్య చేశాడు. దీంతో అరెస్టైన చెంతమారా కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. కానీ అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు.
ఇంట్లోకి చొరబడి హత్యకొంతకాలం క్రితం జైలు నుంచి బెయిల్పై విడుదలైన చెంతమార.. సోమవారం సుధాకరణ్ను, అతడి తల్లి లక్ష్మిని వారి ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారించగా.. సుధాకరణ్ తనను చంపుతాడనే అనుమానంతో వారిని హత్య చేసినట్లు పేర్కొన్నాడు.
పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదుఇంటి పెద్దలను కోల్పోయిన సుధాకరణ్ కూతుర్లు అఖిల, అతుల్య అనాథలుగా మిగిలారు. తమ తల్లిని చంపిన చెంతమార బెయిల్పై వచ్చి పక్కింట్లోనే ఉంటుండడంతో.. మమ్మల్ని కూడా చంపేస్తాడని, అతడిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని, ఇప్పుడు అతడు తమ తండ్రి, నాయనమ్మను పొట్టనపెట్టుకున్నాడని ఆ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని బోరున ఏడుస్తున్నారు. తమ కుటుంబాన్ని అంతం చేసిన నిందితుడు చెంతమారను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొంత కాలానికి బెయిల్పై వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తాడని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన నిందితుడు చెంతమార అరెస్టు వార్త స్థానికులు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గుడిని తమకు అప్పగించాలని, తామే వాడిని చంపేస్తామన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేపట్టి వారిని చెదరగొట్టారు. నేడు చెంతమారను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.. జంట హత్యల రీ కన్స్ట్రక్షన్ కోసం అతడిని నేరస్థలానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.