Yes Bank Shareholders: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్ షేర్‌ ధర అతి స్వల్పంగా ఉండవచ్చుగాక, స్టాక్ మార్కెట్‌లోని అతి పెద్ద కంపెనీల లిస్ట్‌లో దీనిని లెక్కించకపోవచ్చుగాక, ఈ స్టాక్‌ అసలు పోటీలోనే లేదని ఇన్వెస్టర్లు భావించవచ్చుగాక. కానీ, స్టాక్ మార్కెట్‌లో యెస్‌ బ్యాంక్‌ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది, దీనితో పోలిస్తే అగ్రశ్రేణి కంపెనీలు మైళ్ల దూరం వెనుకబడి ఉన్నాయి. విలువ పరంగా మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBIని ఓడించి మరీ యెస్ బ్యాంక్ ఈ రికార్డు సాధించింది.


50 లక్షలు దాటిన సంఖ్య
డేటా ప్రకారం... యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్య 50 లక్షలు దాటింది. భారతీయ స్టాక్ మార్కెట్లో 50 లక్షలకు పైగా వాటాదార్లను కలిగి ఉన్న ఏకైక కంపెనీ యెస్ బ్యాంక్ మాత్రమే. ఈ ప్రకారం చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి స్టాక్ మార్కెట్‌ టాప్ కంపెనీలు యెస్ బ్యాంక్ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు.


వెనకబడిన అతి పెద్ద కంపెనీలు 
తాజా షేర్ హోల్డింగ్ లెక్కల ప్రకారం.. యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్య ప్రస్తుతం 50.57 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూస్తే, మార్కెట్ విలువ ప్రకారం స్టాక్‌ మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 33.62 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్యతో పోలిస్తే, మార్కెట్‌ విలువ పరంగా రెండో అతి పెద్ద కంపెనీ అయిన టీసీఎస్ షేర్‌ హోల్డర్ల సంఖ్య కేవలం సగం మాత్రమే. టీసీఎస్‌కు 25.56 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. విలువ పరంగా మూడో అతి పెద్ద కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ హోల్డర్ల సంఖ్య యెస్‌ బ్యాంక్‌ నంబర్‌లో సగం కూడా లేదు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 22.90 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు.


మైళ్ల దూరంలో వెనుకబడ్డ ఇతర బ్యాంకులు
ఇతర బ్యాంకుల గురించి చెప్పుకుంటే... స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇష్టమైన ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు సంఖ్య పరంగా యెస్ బ్యాంక్ ముందు మరుగుజ్జుల్లా మిగిలాయి. 2023 మార్చి చివరి నాటికి, ICICI బ్యాంక్‌ 17.80 లక్షల మంది వాటాదార్లను కలిగి ఉంది. కోటక్ మహీంద్ర బ్యాంక్‌కు 5.82 లక్షలు, యాక్సిస్ బ్యాంక్‌కు 8.46 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు.


యెస్‌ బ్యాంక్‌లో అతి పెద్ద వాటాదార్లు
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా యెస్‌ బ్యాంక్‌ కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో దాదాపు 28 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ అతి పెద్ద వాటాదారు. యెస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐకి 26.14 శాతం వాటా ఉంది. LICకి 4.34 శాతం, యాక్సిస్ బ్యాంక్‌కు 1.57 శాతం, ICICI బ్యాంక్‌కు 2.61 శాతం, IDFC ఫస్ట్ బ్యాంక్‌కు 1 శాతం షేర్లు ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.