Petrol-Diesel Rates: దేశంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించింది, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ రేటును (Domestic LPG Cylinder Price) 200 రూపాయలు తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదార్లకు ఇప్పటికే రూ. 200 రాయితీ లభిస్తోంది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ తాజాగా అనౌన్స్‌ చేసిన రూ. 200 కన్సెషన్‌తో కలిపి, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్‌ సిలిండర్‌ మీద రూ. 400 డిస్కౌంట్‌ దొరుకుతోంది. తగ్గిన ధర నిన్నటి (బుధవారం, 30 ఆగస్టు 2023) నుంచి అమల్లోకి వచ్చింది. 


మన దేశంలో, రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ (retail inflation‌) జులై నెలలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44%కి పెరిగింది. ద్రవ్యోల్బణం దెబ్బకు బెదిరిపోయిన కోట్లాది మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం కాస్తంత ధైర్యాన్ని, బతుకు మీద ఆశను పుట్టించింది. వంట గ్యాస్‌ కథ కంచికి చేరడంతో, ఇప్పుడు దేశంలో సామాన్య జనాల నుంచి నిపుణుల వరకు అందరి దృష్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల మీదకు మళ్లింది. కేంద్ర ప్రభుత్వం చమురు రేట్లను కూడా తగ్గిస్తుందన్న చర్చ జరుగుతోంది.


ఫ్యూయల్‌ మీద ఫోకస్‌
సిటీ గ్రూప్‌ రిపోర్ట్‌ ప్రకారం, వంట గ్యాస్ రేట్లలో కోత దేశంలో ద్రవ్యోల్బణం తగ్గవచ్చు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఫోకస్‌ ఫ్యూయల్‌ మీద ఉండొచ్చు. ముఖ్యంగా, మన దేశంలో ఫెస్టివ్‌ సీజన్‌ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ప్రధాన పండుగలు ఉన్నాయి. అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్‌, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు కూడా క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నాయి. దీంతో, దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, పెట్రోల్ & డీజిల్ ధరలను తగ్గిస్తుందని సిటీ గ్రూప్‌ రిపోర్ట్‌ చెబుతోంది.


వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు దేశాన్ని దడదడలాడించిన టమాటా ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. దీంతో, ఆగస్టు నెల ద్రవ్యోల్బణం రేటు (సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు) 6 శాతానికి దిగువన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 


ఆహార పదార్థాల ధరల తగ్గింపుపై దృష్టి
ఇటీవలి నెలల్లో, దేశంలో ఆహార పదార్థాల రేట్లు విపరీతంగా పెరిగాయి. అందువల్లే రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ రేటు అమాంతం పెరిగిపోతోంది. ఆహార ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత కొన్నాళ్లుగా.. బియ్యం, గోధుమలు, ఉల్లిపాయలు, ఇతర ధాన్యాల ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. తద్వారా, దేశీయ మార్కెట్‌లో సప్లై పెరిగి, అధిక ధరల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్‌
ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఐదు రాష్ట్రాల్లో (తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత 2024 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో, రాబోయే కాలంలో తన ఖజానా నుంచి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ఆ డబ్బులో కొంత వాటాను కేటాయించే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: పైచూపులోనే పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial