India Trade Data: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితిలో వచ్చిన మార్పులు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశం కూడా దీనికి మినహాయింపు కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఇతర దేశాలతో భారత్ వాణిజ్యం కూడా మలుపులు తిరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), భారతదేశ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ‍‌(India US Trade) ఆవిర్భవించింది. చాలాకాలం అదే స్థానంలో కొనసాగిన చైనా (India China Trade) ఇప్పుడు వెనుకబడింది.


ఒకటిన్నర రెట్లు పెరిగిన వ్యాపారం 
వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం... 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా (biggest trading partner) అమెరికా నిలిచింది. ఈ కాలంలో రెండు దేశాల మధ్య 128.55 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో, అంటే 2021-22లో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 119.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో, ఏడాది కాలంలో రెండు దేశాల వాణిజ్యంలో దాదాపు 7.65 శాతం పెరుగుదల నమోదైంది. అంతకంటే ముందు, 2020-21లో ఇది కేవలం 80.51 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే గత రెండేళ్లలో భారత్, అమెరికా మధ్య పరస్పర వాణిజ్యం ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడడం దీనికి ప్రధాన కారణం.


అధికారిక సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు 78.31 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. ఇది ఏడాది క్రితం, 2021-22లో ఇది 76.18 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ విధంగా గత ఏడాది కాలంలో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 2.81 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత్‌కు అమెరికా నుంచి దిగుమతులు 16 శాతం పెరిగి 50.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు గణనీయంగా పెరిగినప్పటికీ, వాణిజ్య సమతుల్యత ఇప్పటికీ భారతదేశానికి అనుకూలంగా ఉంది.


చైనాతో తగ్గిన వాణిజ్యం - పెరిగిన లోటు
భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా చాలా సంవత్సరాల పాటు చైనా కొనసాగింది. 2013-14 నుంచి 2017-18 వరకు, ఆ తర్వాత 2020-21లో చైనాదే అగ్రస్థానం. ప్రస్తుతం, ఈ పొరుగు దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యం తగ్గుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం - చైనా మధ్య పరస్పర వాణిజ్యం 1.5 శాతం క్షీణించి 113.83 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం అంటే 2021-22 సంవత్సరంలో దీని విలువ 115.42 బిలియన్ డాలర్లుగా ఉంది.


2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 28 శాతం తగ్గి 15.32 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 4.16 శాతం పెరిగి 98.51 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇరుదేశాల మధ్య మొత్తం వాణిజ్యం తగ్గినా భారత్‌కు ఇబ్బందులు మాత్రం పెరిగాయి. తగ్గిన ఎగుమతులు - పెరిగిన దిగుమతుల కారణంగా చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 2021-22లోని 72.91 బిలియన్‌ డాలర్ల నుంచి 2022-23లో 83.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.


2022-23 కాలంలో, భారత్‌తో వాణిజ్యం విషయంలో, 76.16 బిలియన్‌ డాలర్లతో UAE మూడో స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా (52.72 బిలియన్‌ డాలర్లు), సింగపూర్‌ (35.55 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.