Adani to exit From Wilmar: ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంట నూనెలు, కిరాణా సామగ్రి అమ్ముతున్న అదానీ విల్మార్ లిమిటెడ్‌ నుంచి బయటకు వచ్చేందుకు, అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదానీ విల్మార్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (JV). దీనిలో, గౌతమ్‌ అదానీకి, 43.97 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు చెందిన విల్మార్‌ ఇంటర్నేషనల్‌కు కూడా ఇంతే మొత్తం (43.97) స్టేక్‌ ఉంది. మిగిలిన 12.06 శాతం షేర్లు పబ్లిక్‌ చేతుల్లో ఉన్నాయి. 


డీల్‌ ఓకే అయ్యే ఛాన్స్‌
అదానీ విల్మార్‌లో తనకు ఉన్న మొత్తం 43.97% వాటాను విక్రయించడానికి అదానీ గ్రూప్ గత ఆగస్టు నుంచి ట్రై చేస్తున్నట్లు, కొన్ని మల్టీనేషనల్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో డీల్‌ కుదిరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ జాయింట్ వెంచర్‌లో వాటా అమ్మకం ద్వారా 2.5-3 బిలియన్‌ డాలర్లను అదానీ గ్రూప్‌ ఆశిస్తోంది. నాన్‌-కోర్‌ అసెట్స్‌ను అమ్మేసి, భారీ మొత్తంలో డబ్బు నిల్వలు సృష్టించాలన్నది గౌతమ్‌ అదానీ ప్లాన్‌గా తెలుస్తోంది.


"అదానీ గ్రూప్ కొన్ని వ్యాపారాల నుంచి ఎగ్జిట్‌ అవుతుంది, ఇన్‌ఫ్రా వంటి వంటి కోర్ ఫోకస్డ్‌ ఏరియాల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతుంది" కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పినట్లు ది ఎకనమిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది. అదానీ విల్మార్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చే డబ్బును గ్రూప్‌లోని ఇతర కీలక వ్యాపారాల్లో పెట్టుబడులకు గౌతమ్‌ అదానీ ఉపయోగిస్తారని, అప్పులు చెల్లించడానికి ఆ డబ్బును వాడరని కూడా నివేదించింది.


ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) సెగ్మెంట్‌లో, దేశంలో ఉన్న అతి పెద్ద ప్లేయర్స్‌లో అదానీ విల్మార్ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ఈ కంపెనీ 55,262 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఖర్చులన్నీ పోగా, 607 కోట్ల రూపాయల లాభం మిగుల్చుకుంది. 


అదానీ విల్మార్‌ షేర్‌ ప్రైస్‌
అదానీ విల్మార్ షేరు ధర, ఈ ఏడాది మే మధ్యలోని రూ. 488 నుంచి గత శుక్రవారం రూ. 317.45కి తగ్గింది. ఈ రోజు (సోమవారం, 06 నవంబర్‌ 2023) ఉదయం 10.15 గంటల సమయానికి, 0.50 రూపాయలు లేదా 0.16% గ్రీన్‌లో రూ. 317.95 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 41,258 కోట్లు (4.96 బిలియన్ డాలర్లు).


ఈ సంవత్సరం ప్రారంభంలో, అదానీ గ్రూప్‌పై, అమెరికన్‌ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఇచ్చిన బ్లాస్టింగ్‌ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ షేర్లు కుప్పకూలాయి. ఆ సమయంలో ఏకంగా 150 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిదార్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత గ్రూప్ కంపెనీల షేర్ల చాలా వరకు కోలుకున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ వారానికి శుభారంభం, 470 పాయింట్ల జంప్‌తో 64,800 దాటిన సెన్సెక్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial