Stock Market News Updates Today 03 Oct: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావంతో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు (గురువారం, 03 అక్టోబర్‌ 2024)  ఓపెనింగ్ బెల్‌లో భారీగా నష్టపోయాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో పాటు, ఇండెక్స్ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో మారిన రూల్స్‌ అమల్లోకి రావడంతో మార్కెట్ సెంటిమెంట్‌ దెబ్బతింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (మంగళవారం) 84,266 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 1264.20 పాయింట్లు లేదా 1.50 శాతం క్షీణించి 83,002.09 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 25,796 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 344.05 పాయింట్లు లేదా 1.33 శాతం పడిపోయి 25,452.85 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


NSE నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా భారీ క్షీణతతో ప్రారంభమైంది, ప్రారంభ నిమిషాల్లో 550 పాయింట్లకు పైగా జారిపోయింది.


షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ మాత్రమే లాభపడగా, మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో.. మహీంద్రా అండ్ మహీంద్రా 2.23 శాతం క్షీణించింది. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, పవర్ గ్రిడ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో హిందాల్కో ఇండస్ట్రీస్ మాత్రమే లాభపడగా, ఇండెక్స్‌లోని మిగిలిన షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌లో.. ఐషర్ మోటార్స్ 3.12 శాతం క్షీణించింది. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


రంగాల వారీగా...
మెటల్ సెక్టార్‌ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


ఉదయం 9.35 గంటల సమయానికి... సెన్సెక్స్ 603.57 పాయింట్లు లేదా 0.72 శాతం క్షీణించి 83,662.72 వద్దకు చేరుకుంది. అంటే, ప్రారంభ క్షీణత నుంచి సగం వరకు కోలుకుంది. నిఫ్టీ 224.75 పాయింట్లు లేదా 0.87 శాతం క్షీణించి 25,572.15 వద్ద ట్రేడవుతోంది.


ఉదయం 09.50 గంటలకు, సెన్సెక్స్ 579.74 పాయింట్లు లేదా 0.69% తగ్గి 83,686.55 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 167.95 పాయింట్లు లేదా 0.65% తగ్గి 25,628.95 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ.. జపనీస్ స్టాక్స్‌లో ఉత్సాహం, వాల్ స్ట్రీట్‌లో పరిస్థితి మెరుగుపడడంతో ఆసియా మార్కెట్లు ఈ రోజు సానుకూలంగా ఉన్నాయి. నికాయ్‌ 2.21 శాతం పెరిగింది, టోపిక్స్‌ 2 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 ఇండెక్స్‌ స్వల్పంగా 0.07 శాతం క్షీణించగా, హాంగ్‌ కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ 2.35 శాతం క్షీణించింది. చైనా మార్కెట్లు ఈ వారమంతా సెలవులో ఉన్నాయి.


వాల్ స్ట్రీట్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 39.55 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 42,196.52 వద్ద ముగిసింది. S&P 500 0.01 శాతం లాభపడి 5,709.54 వద్ద ఆగింది. నాస్డాక్ కాంపోజిట్ 14.76 పాయింట్లు లేదా 0.08 శాతంతో 17,925.12 వద్ద క్లోజ్‌ అయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా చమురు రేట్ల మంట - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి