SoftBank: One97 Communications Ltdలో (Paytm) మరోమారు భారీ సెల్లింగ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారంతో, 86 శాతం Paytm షేర్లకు లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగిసింది. వాటిని అమ్ముకునే స్వేచ్ఛ ఇన్వెస్టర్లకు రావడంతో, వాళ్లు లాభాల స్వీకరణకు దిగారు. పెద్ద ఇన్వెస్టర్లు రంగంలోకి దిగితే షేరు ధర భారీగా పతనం అవుతుందన్న భయంతో, రిటైల్‌ ఇన్వెస్టర్లు ముందు నుంచే అమ్మకాలు మొదలు పెట్టారు. దీంతో Paytmలో సెల్లాఫ్‌ కనిపిస్తోంది. 


Paytm ప్రి-ఐపీవో ఇన్వెస్టర్లలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ కూడా ఒకటి. ఇది, ప్రపంచంలో అతి పెద్ద పెట్టుబడి సంస్థల్లో ఒకటి. Paytmలో సాఫ్ట్‌బ్యాంక్‌ లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ఈ వారంలో ముగుస్తుంది. దీంతో, $215 మిలియన్ల (రూ. 1750 కోట్లు) విలువైన Paytm షేర్లను విక్రయించాలని చూస్తోంది. ఈ లెక్కన, భారీ సెల్లాఫ్‌ ఖాయంగా కనిపిస్తోంది.


Paytmలో 29 మిలియన్ ‍‌(2.9 కోట్లు) షేర్లను ఒక్కొక్కటి రూ. 601.45 చొప్పున అమ్ముతానని సాఫ్ట్‌బ్యాంక్‌ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఇది 7 శాతం తగ్గింపు.


సాఫ్ట్‌బ్యాంక్, Paytmలో మొత్తం $1.6 బిలియన్ల పెట్టుబడి పెట్టింది. గతేడాది నవంబర్‌లో, కంపెనీ IPO సమయంలో $220-250 మిలియన్లను వెనక్కు తీసుకుంది.


Paytmలో 17.45 శాతం వాటా
SVF ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా సాఫ్ట్‌బ్యాంక్‌కు Paytmలో 17.45 శాతం వాటా ఉంది. Paytm నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్లిపోవాలని తొందరపడడం లేదని సాఫ్ట్‌బ్యాంక్‌ చెబుతోంది. ఒకేసారి అమ్మకాలకు దిగితే షేరు ధర కుప్పకూలి, రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోతారు కాబట్టి.. దశలవారీగా అమ్మకాలు చేపడతామని తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధిలో సాఫ్ట్‌బ్యాంక్‌ నెమ్మదిగా ఎగ్జిట్‌ అవుతుందని భావిస్తున్నారు.


వన్‌97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో.. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, దాని ఫిన్‌టెక్ అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ కో అతి పెద్ద వాటాదార్లు. అలీబాబా.కామ్ సింగపూర్‌ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వన్‌97లో 6.26 శాతం వాటా ఉండగా, యాంట్‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్స్‌కు 24.88 శాతం స్టేక్‌ ఉంది. బెర్క్‌షైర్‌ హాత్‌వేకు చెందిన BH ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు 2.41 శాతం యాజమాన్యం ఉంది. Paytm పంజరం నుంచి ఎగిరి పోవడానికి ఇప్పుడు వీటికి కూడా స్వేచ్ఛ దొరికింది. అయితే.. అగ్రెసివ్‌గా అమ్ముతాయా, లేదా అన్నదే క్వచ్ఛన్‌ మార్క్‌.


2022 సెప్టెంబర్ త్రైమాసికంలో వన్97 కమ్యూనికేషన్స్ నష్టాలు మరింత పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 481 కోట్ల నష్టం తాజాగా రూ. 593.9 కోట్లకు చేరింది. అయితే.. కార్యకలాపాల ఆదాయం మాత్రం గణనీయంగా 
పెరిగింది. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలోని రూ. 1,086.4 కోట్ల నుంచి దాదాపు 76 శాతం వృద్ధితో రూ. 1,914 కోట్లకు చేరుకుంది. 


పాలసీబజార్, డెలివరీలోనూ భారీ స్టేక్‌
పేటీఎం, పాలసీబజార్, డెలివరీలో కలిపి, సుమారు $2.2 బిలియన్లు పెట్టుబడిని సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టింది. వాటి ఐపీవోల సమయంలో $560 మిలియన్ల  షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో విక్రయించింది. పాలసీబజార్, డెలివరీలోనూ సాఫ్ట్‌బ్యాంక్‌ లాక్‌-ఇన్‌ పిరియడ్‌ మరో 10 రోజుల్లో ముగుస్తుంది. 


OFS తర్వాత, పాలసీబజార్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు ఇంకా 220 మిలియన్ డాలర్ల ‍‌(రూ. 1800 కోట్లు) విలువైన 10-11 శాతం స్టేక్‌ ఉంది. డెలివరీలో 380 మిలియన్‌ డాలర్ల ‍(రూ. 5,560 కోట్లు) విలువైన 18 శాతం పైగా వాటా ఉంది. 


రిటైల్‌ ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకుని వీటిలోనూ అగ్రెసివ్‌ సెల్లింగ్‌కు సాఫ్ట్‌బ్యాంక్‌ దిగకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.