Stock Market News Updates Today in Telugu: ఈ వారంలో దాదాపు ప్రతిరోజూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 27 సెప్టెంబర్‌ 2024) మందగమనంతో ప్రారంభమయ్యాయి. వారంలో చివరి రోజు కావడంతో మార్కెట్‌పై ఒత్తిడి ఉంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (గురువారం) 85,836 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 57 పాయింట్లు పెరిగి 85,893.84 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 26,216 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 32 పాయింట్లు పెరిగి 26,248.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ప్రారంభమైన వెంటనే మార్కెట్లు కొత్త గరిష్టాలను లిఖించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 85,955.50 వద్ద కొత్త గరిష్ట స్థాయికి ‍(Sensex at fresh all-time high) చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,266.40 వద్ద జీవితకాల గరిష్ఠ స్థాయిని (Nifty at fresh all-time high) అందుకుంది.


ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మార్కెట్‌ సైడ్‌ వేస్‌లోకి వెళ్లింది. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ కేవలం 35 పాయింట్ల లాభంతో 85,870 పాయింట్ల వద్ద, నిఫ్టీ కేవలం 16 పాయింట్ల లాభంతో 26,235 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి. 


సెన్సెక్స్ & నిఫ్టీ షేర్ల పరిస్థితి
ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌లో దాదాపు సగం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. తొలి సెషన్‌లో ఐటీ షేర్లు భారీ వృద్ధిని కనబరిచాయి. ఇన్ఫోసిస్ దాదాపు 2.60 శాతం బలపడింది. టెక్ మహీంద్రా కూడా రెండున్నర శాతానికి పైగా పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు కూడా 2 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అత్యధికంగా 2.27 శాతం, ఎల్ అండ్ టీ దాదాపు 2 శాతం, భారతి ఎయిర్‌టెల్ 2 శాతం పడిపోయాయి.


ప్రి మార్కెట్‌
దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం కాకముందే, ప్రి-మార్కెట్‌ సెషన్‌లో, పెరుగుదల సూచనలు కనిపించాయి. ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్ల లాభంతో 85,900 పాయింట్ల దగ్గర, నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంతో 26,250 పాయింట్ల దగ్గర ఉన్నాయి. ఉదయం, GIFT నిఫ్టీ ఫ్యూచర్స్ దాదాపు 50 పాయింట్ల ప్రీమియంతో 26,630 పాయింట్ల దగ్గర ఉన్నాయి.


ఈ వారంలో రికార్డుల పరంపర
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు సృష్టిస్తూ ముందుకెళ్లింది. మార్కెట్ కొత్త గరిష్ట స్థాయితో ఈ వారాన్ని (సోమవారం) ప్రారంభించింది. నిన్న, గురువారం నాడు కూడా రికార్డుల ఉత్పత్తి ప్రక్రియ కొనసాగింది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 85,930.43 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26,250.90 పాయింట్ల వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 666.25 పాయింట్ల (0.78 శాతం) లాభంతో 85,836.12 పాయింట్ల వద్ద, నిఫ్టీ 211.90 పాయింట్ల (0.81 శాతం) లాభంతో 26,216.05 పాయింట్ల వద్ద ముగిశాయి.


ఉదయం 10.15 గంటలకు, BSE సెన్సెక్స్ 91.09 పాయింట్లు లేదా 0.11% పెరిగి 85,927.20 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 42.15 పాయింట్లు లేదా 0.16% పెరిగి 26,258.20 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
గురువారం అమెరికా మార్కెట్లు పటిష్టంగా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.62 శాతం పెరిగింది. S&P 500 ఇండెక్స్ 0.40 శాతం, టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్డాక్ 0.60 శాతం విలువ పెంచుకున్నాయి. S&P 500 5,767.37 పాయింట్ల వద్ద కొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ఈ రోజు, ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో ఓపెన్‌ అయ్యాయి. ఆ తర్వాత అన్ని మార్కెట్లు తిప్పుకుని లాభాల్లోకి మారాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: వెహికల్‌ ఓనర్స్‌కి కిక్‌ ఇచ్చే కబురు - పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గొచ్చు!