RBI MPC Meet February 2024 Decisions: బ్యాంక్‌ నుంచి గృహణ రుణం సహా వివిధ రకాల లోన్‌లు తీసుకుని నెలనెలా EMI కడుతున్న రుణగ్రస్తులకు, కొత్తగా లోన్‌లు తీసుకోవాలని భావిస్తున్న వారి ఆశలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. గరిష్ట స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు దిగి వస్తాయోమే, EMI మొత్తం తగ్గుతుందేమోనని ఆశగా ఎదురు చూసిన ప్రజానీకానికి ఈసారి కూడా నిరాశ తప్పలేదు.


'స్టేటస్ కో' కొనసాగింపు
ముందు నుంచీ మార్కెట్‌ ఊహిస్తున్నట్లుగానే, ఆర్‌బీఐ రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.5 శాతం వద్దే కంటిన్యూ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. దీంతో, వరుసగా ఆరో సారి కూడా రెపో రేట్‌ మారలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో RBI MPC తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.5 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్‌ కంటిన్యూ చేస్తోంది. 


రెపో రేట్‌తో పాటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్‌ను 6.75% వద్ద, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్‌ను 6.25% వద్దే ఆర్‌బీఐ ఉంచింది, వీటిని కూడా మార్చకుండా కొనసాగించింది.


అంతర్జాతీయ బ్యాంక్‌ల ప్రభావం
అంతర్జాతీయంగా చూస్తే, వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, పాత రేట్లనే కంటిన్యూ చేస్తున్నాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వంటి కీలక బ్యాంక్‌లు కీలక రేట్ల మీద 'స్టేటస్‌ కో' కొనసాగిస్తున్నాయి. ఆ ప్రభావం ఆర్‌బీఐ మీద కనిపించింది.


ఈ నెల 6న ప్రారంభమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌, ఈ రోజు ముగిసింది. MPC తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. MPC సమీక్షలో, క్రెడిట్ పాలసీ కింద, 'వసతి ఉపసంహరణ' ‍‌(Withdrawal of accommodation) వైఖరిని కేంద్ర బ్యాంక్‌ కొనసాగించింది. 


గవర్నర్‌ ప్రసంగంలోని కీలక విషయాలు
పారిశ్రామిక రంగానికి సంబంధించి గ్రామీణ డిమాండ్‌లో మెరుగుపడుతోందని, పట్టణాల్లో బలంగా ఉందని దాస్‌ చెప్పారు. తయారీ రంగంలో మంచి గణాంకాలు కనిపిస్తున్నాయని వివరించారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగున్నాయని, వృద్ధి రేటు అంచనాలను మించి నమోదవుతోందని శక్తికాంత దాస్‌ చెప్పారు. ఇదే ఒరవడి 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో GDP వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా వేశారు.


ద్రవ్యోల్బణం గురించి కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ మాట్లాడారు. దేశంలో ఆహార పదార్థాల ధరల్లో తీవ్రమైన మార్పులు ఉన్నాయని చెప్పిన దాస్‌, ధరల్లో ఒడుదొడుకులు కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌ (Core Inflation) మీద ప్రభావం చూపుతున్నాయని వివరించారు. దేశంలో చిల్లర ద్రవ్యోల్బణాన్ని  (Retail Inflation) 4 శాతం లోపునకు తీసుకురావాలన్న లక్ష్యానికి ఆర్‌బీై కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిని ఈ ఏడాది మరింత తగ్గించడంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 5.4 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇది 4.5 శాతానికి తగ్గుతుందని కేంద్ర బ్యాంక్‌ లెక్కగట్టింది. 


దేశంలో జరుగుతున్న మొత్తం చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపుల వాటా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, డిజిటల్‌ చెల్లింపుల భద్రతను మరింత పెంచడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు దాస్‌ చెప్పారు. రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ ఆఫ్‌లైన్‌లోనూ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


మరో ఆసక్తికర కథనం:  రేంజ్‌ తగ్గని గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే