Raymond Brand: రేమండ్ గ్రూప్‌ FMCG కంపెనీ 'రేమండ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్‌'కు చెందిన "పార్క్ అవెన్యూ", "కామసూత్ర" వంటి కన్స్యూమర్ కేర్ బిజినెస్‌ను గోద్రెజ్ కన్స్యూమర్ కొనుగోలు చేయబోతున్నట్లు గత గురువారం నాడు (27 ఏప్రిల్ 2023) వార్తలు వచ్చాయి. రూ. 2825 కోట్లతో జరుగుతున్న ఈ డీల్ మే 10, 2023 నాటికి పూర్తవుతుంది. వస్త్ర దిగ్గజ కంపెనీ రేమండ్‌, 2025 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కొత్త డీల్‌ నేపథ్యంలో, రేమండ్‌ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. 

రేమండ్ పేరు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు సుపరిచితం. దుస్తులు అంటే రేమండ్‌ అన్నంతగా ప్రజల మనస్సుల్లో పాతుకుపోయింది. రేమండ్‌ వస్త్రంతో కుట్టించిన బట్టలను హోదాకు చిహ్నంగా ఇప్పటికీ భావిస్తారు. రేమండ్ సూటింగ్‌ అండ్‌ షర్టింగ్ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ విభాగంలో, మన దేశంలో 60 శాతం మార్కెట్‌ రేమండ్‌దే. దీంతోపాటు, మన దేశంలో అతి పెద్ద ఉన్ని బట్టల తయారీ సంస్థ కూడా ఇదే.

దేశ, విదేశాల్లో రేమండ్‌ పాదముద్రరేమండ్ పంపిణీ నెట్‌వర్క్ అత్యంత విస్తృతంగా ఉంది. దేశంలోని ప్రతి చిన్న, పెద్ద నగరాల్లో మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. 500కు పైగా పట్టణాలు, నగరాల్లో 900కు పైగా స్పెషాలిటీ రిటైల్ స్టోర్‌లు, 30,000కు పైగా రిటైలర్‌ల ద్వారా దేశవ్యాప్తంగా రేమండ్ బ్రాండ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక సరళీకరణ తర్వాత మన దేశంలో మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షోరూమ్‌ల ట్రెండ్ మొదలైంది. రేమండ్ బ్రాండ్, దీని మొదటి స్పెషాలిటీ రిటైల్ షోరూమ్ 1958లో ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న కింగ్స్ కార్నర్‌లో ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇది ప్రారంభమైంది. 

ప్రస్తుతం.. అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ దేశాలు సహా ప్రపంచంలోని 55 దేశాల్లో రేమండ్ ఉనికి ఉంది. రేమండ్‌లో 20,000కు పైగా డిజైన్‌లు, సూటింగ్ ఫాబ్రిక్ రంగులు ఉన్నాయి. రంగుల విషయంలో ఇంత పెద్ద సంఖ్యలో డిజైన్‌లు కలిగి ఉన్న ఏకైక సంస్థ ఇదే.

పెళ్లిళ్లలో రేమండ్ బూమ్ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశంలో వివాహాల సమయంలో రేమండ్‌ బ్రాండ్‌ సూట్స్‌ ధరించడం ఒక సంప్రదాయంగా, దర్జాగా మారింది. చలికాలంలో ఉన్ని వస్త్రాల కోసం వెదికేవాళ్ల మొదటి ఎంపిక రేమండ్‌. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు వర్గాల వారీగా రేమండ్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి.

రేమండ్ చరిత్ర1925లో అబ్రహం జాకబ్ రేమండ్ ముంబై సమీపంలోని థానేలో రేమండ్ ఉలెన్ మిల్ పేరుతో ఒక చిన్న ఉన్ని మిల్లును స్థాపించారు. వ్యవస్థాపకుడి పేరిట రేమండ్ కంపెనీ, బ్రాండ్‌ ప్రారంభమైంది. 1944లో లాలా కైలాష్‌పత్ సింఘానియా రేమండ్‌ను కొనుగోలు చేశారు. అప్పుడు ఈ కంపెనీ రేమండ్ బ్లాంకెట్లు, చౌకగా ఉన్ని వస్త్రాలు తయారు చేసేది. ఆ తర్వాత కొత్త సాంకేతికతను స్వీకరించడం ద్వారా విస్తరించడం ప్రారంభించింది. అప్పుడే భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత.. దేశ అవసరాలు, స్వయం సమృద్ధిని దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో తయారీ ప్రారంభించారు.

టెక్నాలజీని స్వీకరించడంలో రేమండ్‌కు ఎవరూ సాటిరారు1952లో, కైలాష్‌పత్ సింఘానియాకు తన వ్యాపారంలో సహాయం చేయడానికి ఆయన అల్లుడు గోపాలకృష్ణ సింఘానియా వచ్చారు, అప్పుడు మరో ముందడుగు పడింది. 1958లో, పాలిస్టర్‌తో ఉన్నిని కలపడం ప్రారంభించిన మొదటి కంపెనీగా రేమండ్‌ అవతరించింది, టిరోల్‌తో ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఒకటి కంటే ఎక్కువ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో కంపెనీ తన మొదటి రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించింది. 1960లో కంపెనీ పాత యంత్రాలన్నింటినీ తొలగించి సరికొత్త యంత్రాలను తీసుకొచ్చింది. దేశంలో ఆధునిక యంత్రాలను ఉపయోగించిన తొలి కంపెనీగా రేమండ్ నిలిచింది. 1967 వేసవిలో, రేమండ్ ట్రోవిన్ అనే ఫాబ్రిక్‌ను విడుదల చేసింది. 1968లో, కంపెనీ థానేలోనే ఒక రెడీమేడ్ గౌర్మెట్స్ ప్లాంట్‌ను స్థాపించింది. 1979లో జలగావ్‌లోనూ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

విజయపత్ సింఘానియా కాలంలో విమానయానం1980లో, కైలాష్‌పత్ సింఘానియా కుమారుడు విజయపత్ సింఘానియా రేమండ్‌ ఛైర్మన్‌ అయ్యారు. 1984లో ఆయన సారథ్యంలో కొత్త ప్లాంట్‌ను స్థాపించి 1986లో "పార్క్ అవెన్యూ" బ్రాండ్‌ను ప్రారంభించారు, ప్రజలకు సువాసన పంచారు. 1990లో, రేమండ్ తన మొదటి విదేశీ షోరూమ్‌ని ఒమన్‌లో ప్రారంభించింది. 1991లో, "కామసూత్ర" పేరిట ప్రీమియం కండోమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది మార్కెట్‌లోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే దేశంలో రెండో అతి పెద్ద కండోమ్ బ్రాండ్‌గా నిలిచింది. 1996లో, కార్పొరేట్ విమాన ప్రయాణికుల కోసం ఎయిర్ చార్టర్ సర్వీస్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. "డెనిమ్" బ్రాండ్‌ తయారీ 1996లో ప్రారంభమైంది. "పార్క్స్" పేరుతో క్యాజువల్ వేర్ బ్రాండ్ 1999లో ప్రారంభమైంది. కాలర్‌ప్లస్‌ ఫ్యాషన్ కూడా రేమండ్ గ్రూప్‌లోనిదే. 2002లో దీనిని కొనుగోలు చేసింది.

2000 నుంచి గౌతమ్ సింఘానియా నాయకత్వం2000 సంవత్సరంలో, విజయపత్ సింఘానియా తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు కంపెనీ పగ్గాలను అప్పగించారు. అతని నాయకత్వంలో రేమండ్ మరింత విస్త్రతంగా వ్యాపించింది. 2019లో ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించింది. 

వాస్తవానికి, "పార్క్ అవెన్యూ", "కామసూత్ర" వంటి కన్స్యూమర్ కేర్ బిజినెస్‌ను తన ప్రధాన వ్యాపారంగా రేమండ్‌ పరిగణించడం లేదు. కాబట్టి ఈ వ్యాపారాన్ని గోద్రెజ్ కన్స్యూమర్‌కు అమ్మి, ఆ విభాగం నుంచి నిష్క్రమిస్తోంది. రేమండ్‌ ఫుల్ ఫోకస్ టెక్స్‌టైల్ వ్యాపారంపై ఉంది.