Rajesh Mehta gold scam vs Harshad Mehta 1992: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇదివరకు ఎన్నడూ వినని, కనని రీతిలో దలాల్ స్ట్రీట్లో ఒక సరికొత్త భూకంపం సంభవించింది. కేవలం రూ. 4,000 కోట్ల లోపు మార్కెట్ క్యాప్ ఉన్న ఒక కంపెనీ, ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల టర్నోవర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కోవడం చూస్తుంటే.. 1992 నాటి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం కూడా ఈ రాజేశ్ మాయాజాలం ముందు చాలా చిన్నదని కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతాపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఏకంగా 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులతో విరుచుకుపడటంతో.. మార్కెట్లోకి మరో హర్షద్ మెహతా వచ్చాడనే చర్చకు తెరలేచింది.
వందల కోట్ల టర్నోవర్..లక్షల కోట్ల రేంజ్
అసలు ఇండియాలో ఈ కంపెనీ వ్యాపారం ఏంటో చూస్తే.. ఉత్తరాఖండ్లో భారతదేశంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కర్మాగారాన్ని, బెంగళూరులో భారీ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ, కర్ణాటక అంతటా శుభ్ జ్యువెలర్స్ పేరుతో దాదాపు 90 రిటైల్ షోరూములను నడుపుతోంది. అయితే ఈ లోకల్ బిజినెస్ను పట్టుకుని లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎలా బిల్డప్ ఇచ్చారంటే.. దానికి 2015లో స్విట్జర్లాండ్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ వాల్క్యాంబి ని కొనుగోలు చేసి గ్లోబల్ ఫార్చ్యూన్ 500 జాబితాలోకి ఎక్కారు. తాము చూపించే మొత్తం గ్రూప్ టర్నోవర్లో 97 నుండి 99 శాతం ఆదాయం ఈ విదేశీ అనుబంధ సంస్థ నుంచే వస్తోందని నమ్మబలికారు. విదేశీ డేటా ప్రొటెక్షన్ చట్టాలు, గోప్యతా నియమాలను అడ్డుపెట్టుకుని అసలైన రికార్డులను ఎవరికీ చిక్కకుండా ఇన్నాళ్లూ తొక్కిపెట్టారు.
99.80 శాతం మేర ఆదాయానికి లెక్కలే లేవు!
కానీ సెబి వేసిన లోతైన ఆడిట్ గుగ్గీ దెబ్బకు ఈ అకౌంటింగ్ మాయాజాలం పేకమేడలా కూలిపోయింది. స్విట్జర్లాండ్లో కేపీఎంజీ ఆడిట్ చేసిన వాల్క్యాంబి అసలు బ్యాలెన్స్ షీట్ను సెబి పరిశీలిస్తే.. సదరు విదేశీ సంస్థ వాస్తవ ఆదాయం కేవలం రూ. 3,027 కోట్లు మాత్రమేనని తేలింది. కానీ మన రాజేశ్ ఎక్స్పోర్ట్స్ బుక్స్లో మాత్రం ఏకంగా రూ. 15,18,413 కోట్ల ఆదాయం వచ్చినట్లు రికార్డు సృష్టించారు! అంటే 99.80 శాతం మేర చూపించిన ఆదాయానికి అసలు పత్తా లేదని, ఇదంతా కేవలం పేపర్ ల్యాప్ కంపెనీల నెట్వర్క్ ద్వారా సృష్టించిన బోగస్ లావాదేవీలేనని సెబి తేల్చేసింది.
ఎల్ఐసీకి భారీ నష్టం
ఇంతటి అద్భుతమైన గ్లోబల్ గ్రోత్ రేట్లను చూసి మోసపోయింది సామాన్య ఇన్వెస్టర్లు మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కూడా! మార్చి 31, 2026 నాటికి ఉన్న అధికారిక రికార్డుల ప్రకారం.. రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసీకి ఏకంగా 10.80 శాతం వాటా ఉంది. ఏటా వేల కోట్ల రూపాయల ఎగుమతి ఆర్డర్లు సాధిస్తున్నట్లు పేపర్లపై చూపించిన కలరింగ్ను నమ్మి, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఎల్ఐసీ భారీగా నిధులు గుమ్మరించింది. ప్రమోటర్ల సొంత డెరివేటివ్ ట్రేడింగ్ నష్టాలను, నిధుల మళ్లింపును ఇంత పెద్ద జాతీయ సంస్థ దశాబ్ద కాలం పాటు ఎలా గమనించలేకపోయిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ.
హర్షద్ మొహతా కంటే పెద్ద స్కాం రాజేష్ మొహతాది!
1992లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ విలువ ఆ కాలంలో దాదాపు రూ. 4,000 కోట్ల నుండి రూ. 5,000 కోట్లు కాగా, ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కగట్టినా.. ప్రస్తుతం రాజేశ్ మెహతా సృష్టించిన రూ. 15.15 లక్షల కోట్ల ఆదాయ తప్పుడు సమాచారాల ఆరోపణ భారత ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసంగా నిలుస్తుంది. హర్షద్ మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచితే, ఇక్కడ రాజేశ్ మెహతా ఏకంగా ఒక గ్లోబల్ అకౌంటింగ్ మాయాజాలాన్ని సృష్టించి ఇన్వెస్టర్లను, ఎల్ఐసీని దశాబ్ద కాలం పాటు బురిడీ కొట్టించారు. ఒకప్పుడు రూ. 1,028 వద్ద పీక్లో ఉన్న ఈ షేర్ వాల్యూ, సెబి దెబ్బకు రూ. 103 కు పడిపోవడంతో సామాన్య ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు రూ. 12,725 కోట్లు ఆవిరైపోగా.. దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లు ఇప్పుడు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
