Aadhar-PAN Linking: భారతీయ పౌరులకు ఇవాళ చాలా కీలకమైన రోజు. ఒకవేళ మీరు టాక్స్‌ పేయర్‌ అయితే.. టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేసే ముందు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన రోజిది. మీ ఆధార్-పాన్ కార్డ్‌ లింక్‌ చేయడానికి 'ఫైనల్‌ డే' (30 జూన్ 2023) ఈ రోజే. మీ పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని మీరు ఇప్పటికీ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి, ఇప్పుడే లింకేజ్‌ పనిని పూర్తి చేయండి. ఈ రోజు మిస్సయితే, డేట్‌ ఎక్స్‌టెన్షన్‌ ఛాన్స్‌ దొరక్కపోవచ్చు. 


మీరు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాలంటే, ముందుగా మీ ఆధార్- పాన్ కార్డ్‌ను కచ్చితంగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ జత కుదర్చకపోతే ITR ఫైల్‌ చేయలేరు. ఒకవేళ ITR ఫైల్‌ చేసేందుకు టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతించినా, కొన్ని టాక్స్‌ బెనిఫిట్స్‌ను కచ్చితంగా మిస్‌ అవుతారు/నష్టపోతారు.


వాస్తవానికి, ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసిన పాన్‌-ఆధార్ నంబర్‌ అనుసంధానం డెడ్‌లైన్‌ను ‌(PAN-Aadhaar Link Deadline) CBDT పెంచింది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించేందుకు జూన్ 30వ తేదీ వరకు ఎక్స్‌టెండ్‌ చేసింది. మీరు ఈరోజు లోగా పాన్‌-ఆధార్‌ లింక్‌ పూర్తి చేయడానికి రూ. 1,000 జరిమానా కడితే సరిపోతుంది. జులై 1 నుంచి ఇదే పని కోసం (టాక్స్‌పేయర్‌ అయినా, కాకపోయినా) రూ.10 వేలు ఫైన్‌ కట్టాల్సిరావచ్చని సమాచారం. 


పాన్ కార్డ్‌తో ఆధార్‌ లింక్ చేయకపోతే ఏంటి నష్టం?
30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, సదరు వ్యక్తి పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. ఆ తర్వాత అధిక జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. పాన్‌-ఆధార్‌ లింక్‌ కాకపోతే, టాక్స్‌ పేయర్‌కు రిఫండ్‌ రాదు. పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు. అంతేకాదు, పాన్ కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం కాకపోతే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్‌ అకౌంట్, డీమాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్‌ అవసరమైన ప్రతి చోట పని ఆగిపోతుంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, ఫైన్‌ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.


పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.


ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ను ఓపెన్‌ చేయండి.
ఈ వెబ్‌సైట్‌లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్‌ చేయసుకోండి.
మీ పాన్ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) మీ యూజర్‌ ID అవుతుంది.
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో ఓపెన్‌ అవుతుంది.
పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్‌'లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
పాన్‌ కార్డ్‌లో ఉన్న ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "లింక్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ మీ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్-అప్ మెసేజ్‌ మీకు తెలియజేస్తుంది.


మరో ఆసక్తికర కథనం: గోల్డెన్‌ ఛాన్స్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial