Post Office Savings Scheme For Women: దేశంలోని కోట్లాది మంది మహిళలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయి. కొన్ని స్కీముల ద్వారా మహిళలు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇలాంటి వాటిలో.. పొదుపు + పెట్టుబడి ప్రయోజనాలను కలిపి అందిస్తున్న ఒక మంచి పథకం కూడా ఉంది. దీనిలో మహిళలు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కంటే ఎక్కువ రాబడిని పొందుతున్నారు. ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన లేదా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ (Mahila Samman Savings Certificate Scheme).
2 సంవత్సరాలలోనే ఆకర్షణీయమైన రాబడిభారతదేశంలోని మహిళలు, బాలికలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2023లో భారత ప్రభుత్వం మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకాన్ని ప్రారంభించింది. పేరుకు తగ్గట్లుగా, ఈ పథకం కేవలం మహిళలు, బాలికలకు మాత్రమే. ఈ పథకం కింద, ఏ మహిళ లేదా బాలిక అయినా 2 సంవత్సరాల కాల పరిమితితో డిపాజిట్ చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్న వార్షిక వడ్డీ రేటు (Mahila Samman Crtificate Saving Scheme Interest Rate) 7.50%. పేదవాళ్లు కూడా ఈ పథకం కింద ఖాతా ప్రారంభించవచ్చు, కనీసం రూ. 1,000 డిపాజిట్ (Minimum Deposit Limit) చేసినా చాలు. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు (Maximum Deposit Limit) పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పాక్షిక ఉపసంహరణ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఖాతాదారు పథకంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 40% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. పాక్షిక ఉపసంహరణ కేవలం ఒక్కసారికే పరిమితం.
ఎలా దరఖాస్తు చేయాలి?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కింద మహిళలు, బాలికలు అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. మైనర్ బాలిక పేరిట ఖాతా ప్రారంభించాలంటే, ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. ఈ స్కీమ్లో గరిష్ట వయస్సు పరిమితిని నిర్ణయించలేదు. ఈ పథకం కింద ఖాతా తెరవడానికి, మహిళలు తమ సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి ఫారం నింపాలి. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సు నిర్ధరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా రుజువు వంటి సంబంధిత పత్రాలు సమర్పించాలి.
ఒక మహిళ లేదా బాలిక 2025 జనవరిలోనెలలో MSSC ఖాతాను ప్రారంభిస్తే, ఆ అకౌంట్ 2027 జనవరిలో మెచ్యూర్ అవుతుంది, 7.50 శాతం వార్షిక వడ్డీతో కలిపి మొత్తం డబ్బు చేతికి వస్తుంది. అకౌంట్ మెచ్యూరిటీ సమయంలో ఫారం-2ను పూర్తి చేసి డబ్బులు తీసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రైలు ప్రయాణంలో ఎవరైనా సహజ మరణం చెందితే ఎంత పరిహారం లభిస్తుంది?