Train Travel Insurance: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, 288 మంది చనిపోయారు. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వ్యాపారాలు, వ్యాపకాలు, ఆధారపడినవాళ్ల బాగోగులు వంటి వాటిపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది.


45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
మీరు కూడా తరచుగా/అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దీనిని టిక్‌ చేయండి. దీనివల్ల, కేవలం 45 పైసలకే ₹10 లక్షల బీమా కవరేజ్‌ అందుతుంది. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ బీమా డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.


ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను టపాటపా బుక్ చేసుకునే పాసింజర్లలో చాలామంది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం లేదు. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే, అసలు అలాంటి ఆప్షన్‌ ఒకటి ఉందని తెలియకపోవడం మరొక ప్రధాన కారణం. బీమా కోసం చెల్లించాల్సిన మొత్తం ఒక్క రూపాయి కన్నా తక్కువే కాబట్టి, పోతేపోనీ ఒక్క రూపాయి అనుకోండి. మన చేతుల మీదుగా ఎన్ని రూపాయలు వృథాగా ఖర్చు కావడం లేదు?, కానీ, ఇది మాత్రం వృథా కాదు, ఆర్థిక రక్ష. దురదృష్టవశాత్తు ఒడిశా లాంటి సంఘటనలు జరిగినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు కవరేజ్‌ అందుతుంది. గాయపడిన వారికి కూడా బీమా కవరేజ్‌ ఉంటుంది.


నామినీ పేరు తప్పనిసరి
రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేస్తున్నప్పుడు.. IRCTC వెబ్‌సైట్‌లో, యాప్‌లోనూ ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది. లింక్‌ మీద క్లిక్‌ చేస్తే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.


ఎంత క్లెయిమ్ పొందుతారు?
రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉన్న సందర్భంలో, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయాలు అయితే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు.


భారతీయ రైల్వే అందిస్తున్న ఈ ఫెసిలిటీని మీరు గతంలో పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇకపై మాత్రం మరిచిపోవద్దు. మీరు చూపే చిన్నపాటి శ్రద్ధ, మీ కుటుంబం మొత్తానికి ఆర్థిక రక్ష.


ఇది కూడా చదవండి: ITR ఫైలింగ్‌లో ఎక్కువ మంది చేస్తున్న తప్పులివి, మీరు చేయకండి