2000 Rupees Deposit: ఆర్బీఐ ప్రకటించినట్టుగా ఇవాళ్టి నుంచి రెండు వేల రూపాయల నోట్‌ డిపాజిట్‌ లేదా మార్పిడీ ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించాయి. గత అనుభవాలను దృష్టి పెట్టుకొని చాలా మంది వివిధ మార్గాల్లో ఈ నోట్ల మార్చుకునే ప్రయత్నం చేశారు. అయినా ఉదయాన్నే బ్యాంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. 


మే 19, శుక్రవారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నోట్లను ఉపసంహరించుకుంటామని మే 23న ఆర్బీఐ ప్రకటించింది. మే 30 నుంచి సెప్టెంబర్ 2000 వరకు ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను డిపాజిట్ చేయవచ్చని, లేదా వాటిని ఇతర డినామినేషన్ నోట్లుగా మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.


2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి.


రూ.2 లక్షల కోట్ల వరకు పెరగనున్న డిపాజిట్లు
ఆర్‌బీఐ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ & సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేశారు.


బ్యాంక్‌ స్టాక్స్‌ పరుగులు పెట్టే ఛాన్స్‌
ఫైనల్‌గా, బ్యాంకుల్లో డిపాజిట్‌ బేస్‌ పెరగడం వల్ల బ్యాంకుల్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి మెరుగుపడుతుంది. నికర వడ్డీ మార్జిన్‌లపై సానుకూల ప్రభావం పడుతుంది. FY24 రెండో అర్ధభాగంలో బ్యాంక్‌ ఫలితాల్లో ఇది ప్రతిబింబిస్తుంది. బ్యాంక్‌ స్టాక్స్‌ పరుగులు పెట్టే అవకాశం ఉంది.       


రూ. 2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే ప్రజలు, తమ అవసరాల కోసం ఆ డబ్బును చిన్న డినామినేషన్లలో తక్కువ కాలంలోనే వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి, కొన్ని కొత్త డిపాజిట్లను తాత్కాలిక డిపాజిట్లుగా చూడాల్సి ఉంటుంది.   


బంగారం, స్థిరాస్తి, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు
రూ. 2000 నోట్లలో మరికొంత భాగం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకపోవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్‌ చేసి ఆదాయ పన్ను శాఖ కంట్లో పడే బదులు అత్యధిక విలువైన వస్తువులు, బంగారం వంటివాటిని ప్రజలు కొనే అవకాశం ఉంది. లేదా రియల్ ఎస్టేట్‌పై ఖర్చు చేయవచ్చు. దీనివల్ల, వివిధ రంగాల్లో కూడా అమ్మకాలు, ఆయా కంపెనీల ఆదాయం అనూహ్యంగా పెరగవచ్చు.     


బ్యాంకుల్లో నిలబడే డిపాజిట్లు 15-30%
చెలామణిలో ఉన్న రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లలో, కేవలం 15-30% మాత్రమే మన్నకైన/దీర్ఘకాలిక డిపాజిట్లుగా బ్యాంకుల్లోకి చేరతాయన్నది అంచనా. ఈ ప్రకారం, రూ. 50,000 కోట్ల నుంచి రూ. 90,000 కోట్ల వరకు విలువైన పింక్‌ నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చేరతాయని ఊహిస్తున్నారు.     


2016 నవంబర్‌లోని పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పడు పెద్ద నోట్లను రద్దు చేశారు, ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారు. అప్పుడు కరెన్సీ చెల్లుబాటు కాకుండా పోయింది, ఇప్పుడు రూ. 2,000 నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గానే కొనసాగుతాయి.    


బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం ప్రజలకు మే 23 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఉంది.                


ఇది కూడా చదవండి: ₹2000 నోట్ల డిపాజిట్లకు పాత రూల్‌ - పరిమితి దాటితే PAN ఇవ్వాల్సిందే