Aadhar Authentication: కేంద్ర ప్రభుత్వంలోనైనా, రాష్ట్ర ప్రభుత్వంలోనైనా ఏదైనా ప్రభుత్వ పథకం ఒక వ్యక్తికి అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు (Non Government Organisations) కూడా వ్యక్తుల ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చన్నట్లుగా నిబంధనలు మారబోతున్నాయి.


సలహాల కోసం ప్రకటన జారీ
ప్రమాణీకరణ (Authentication) కోసం ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించుకనే నియమాలకు తుది రూపునిచ్చే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది. వచ్చే నెల 5వ తేదీలోగా సూచనలు పంపాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. 


ప్రస్తుతం ఆధార్ అథెంటికేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఉపయోగిస్తుండగా, నిబంధనల మార్పు తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా ఆధార్‌ను ప్రామాణీకరణ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.


ఆధార్‌ ప్రామాణీకరణ కోసం ప్రైవేట్‌ సంస్థలను కూడా అనుమతించడం వల్ల ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దేశంలోని ప్రతి వ్యక్తికి సేవలు అందుబాటులోకి రావాలని, ప్రజల జీవితం బాగుండాలనేది ఈ నిర్ణయం వెనుకున్న లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించాలనుకునే అన్ని ప్రభుత్వేతర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదాను పంపింది. దీనిపై వారి నుంచి సూచనలు కోరింది. సంబంధిత వర్గాలు తమ సలహాలు, సూచనలను తిరిగి సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు పంపుతాయి.


సామాన్య ప్రజలు కూడా సలహా ఇవ్వవచ్చు
ఆధార్‌ ప్రామాణీకరణ నిబంధనల్లో ప్రతిపాదిత మార్పులను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ప్రభుత్వేతర సంస్థలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. అన్ని వర్గాల నుంచి 2023 మే 5వ తేదీ వరకు అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ సలహాలు, సూచనలు ఆధారంగా ప్రతిపాదిత ముసాయిదాలో మార్పులు చేసి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (UDAI) పంపుతారు.


కేవలం రూ. 50 కే PVC ఆధార్ కార్డు పొందండి
ఒకవేళ మీ కార్డ్‌ కనిపించకుండా పోతే PVC ఆధార్‌ కార్డ్‌ను తెప్పించుకోవచ్చు. ఆధార్ జారీ చేసే సంస్థ ఉడాయ్‌ (UIDAI), PVC ఆధార్‌ కార్డ్‌ను ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి (PVC Aadhaar Card Online Order) అనుమతిస్తుంది. UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు. పాలీవినైల్ క్లోరైడ్ కార్డ్‌, అంటే PVC ఆధార్ కార్డును (PVC Aadhaar Card Order Online Fees) కేవలం రూ. 50 చెల్లించి పొందవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటో, పుట్టిన తేదీ మొదలైన సమాచారం నమోదై ఉంటాయి. 


PVC ఆధార్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?


ముందుగా https://uidai.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆ తర్వాత, హోమ్‌ పేజీలో కనిపించే My Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇందులో Order Aadhaar PVC Card మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు 16 అంకెల వర్చువల్ ఐడీని కూడా ఇవ్వవచ్చు. దీని తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేయండి.
ఇప్పుడు, ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని సంబంధిత గడిలో పూరించి సబ్మిట్‌ చేయండి
ఆ తర్వాత, PVC ఆధార్ కార్డ్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
దీని తర్వాత మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ చెల్లింపు చేయవచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత, మీ PVC కార్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు వస్తుంది.