Paytm Share buyback: షేర్ల బై బ్యాక్‌ పేరుతో కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను ఊరిస్తూ వస్తున్న Paytm (One97 Communications) ఎట్టకేలకు ఆ స్కీమ్‌ పూర్తి వివరాలను ప్రకటించింది. షేర్‌ బై బ్యాక్‌ పథకానికి పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 


పేటీఎం షేర్‌ బై బ్యాక్‌ వివరాలు
ఈక్విటీ షేర్ల బై బ్యాక్ కోసం ₹850 కోట్లను (బై బ్యాక్‌ పన్నులు మినహాయించి) పేటీఎం కేటాయించింది. ఒక్కో షేరును ₹810 ధరకు మించకుండా కొనబోతోంది. ఇందుకోసం ఓపెన్ మార్కెట్ రూట్‌ను ఎంచుకుంది. అంటే, నేరుగా స్టాక్‌ మార్కెట్‌లో ఫ్లోట్‌ అయ్యే షేర్లనే దరదఫాలుగా కొంటూ వెళ్తుంది. పన్నులతో కలిపి బై బ్యాక్‌ కోసం ₹1048 కోట్లు ఖర్చు పెట్టబోతోంది. పేటీఎం చివరి ఆదాయ నివేదిక ప్రకారం ₹9,182 కోట్ల లిక్విడిటీ కంపెనీ దగ్గర ఉంది.


మంగళవారం BSEలో Paytm షేర్లు ₹538.40 వద్ద ముగిశాయి. ఈ ధరతో పోలిస్తే, బై బ్యాక్‌ ఆఫర్‌ ద్వారా ఒక్కో షేరును 50 శాతం ప్రీమియంతో కంపెనీ కొనబోతోంది. ఓపెన్‌ మార్కెట్‌ నుంచి విడతల వారీగా కొంటూ, గరిష్టంగా ఆరు నెలల్లో ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది.


ఒక్కో షేరుకు ₹810 గరిష్ట ధర చొప్పున ₹850 కోట్ల మొత్తానికి మార్కెట్‌ నుంచి తిరిగి కొనుగోలు చేయబోయే షేర్ల గరిష్ట సంఖ్య 1,04,93,827. ఇది కంపెనీ పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 1.62 శాతానికి సమానం.


కనిష్ట బై బ్యాక్ సైజ్‌, గరిష్ట బై బ్యాక్ ప్రైస్‌ను ఆధారంగా ఈ కంపెనీ కనీసం 52,46,913 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తుంది.


పరువు నిలబెట్టుకునేందుకే బై బ్యాక్‌
2021 నవంబర్‌లో తన IPOను పేటీఎం ప్రారంభించింది, అదే నెలలో షేర్లను మార్కెట్‌లో లిస్ట్‌ చేసింది. అప్పట్లో ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద IPO. ఒక్కో షేరును ₹2,150 చొప్పున జారీ చేసి ₹18,300 కోట్లను మార్కెట్‌ నుంచి సమీకరించింది. అయితే, హయ్యర్‌ వాల్యుయేషన్‌ కారణంగా దారుణంగా దెబ్బతింది. పేటీఎం షేర్లు దాని IPO ధర నుంచి 75% క్షీణించాయి.


లిస్టింగ్‌ సమయం నుంచి పేటీఎం షేర్లు పడుతూనే ఉండడంతో, కంపెనీ తీరు మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. భారీ వాల్యుయేషన్‌తో వచ్చి ఇన్వెస్టర్లను నష్టాల్లో ముంచిందంటూ అన్ని వైపుల నుంచి తిట్లు మొదలయ్యాయి. దీంతో, పోయిన పరువును కాస్తయినా తిరిగి దక్కించుకునేందుకు షేర్ల బై బ్యాక్‌ ప్లాన్‌ను ఈ కంపెనీ అనుసరిస్తోంది. లిస్టింగ్ తర్వాత 13 నెలల్లోపే ఈ కంపెనీ బై బ్యాక్‌కు రావడం విశేషం.


స్వతంత్ర డైరెక్టర్లు సహా, సమావేశానికి హాజరైన డైరెక్టర్లు అందరూ షేర్‌ బై బ్యాక్ ప్రతిపాదనకు అనుకూలంగా ఏకగ్రీవంగా ఓటు వేశారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్లు, కీలక నిర్వహణ సిబ్బంది ఈ బై బ్యాక్ కాలంలో తమ షేర్లను విక్రయించరు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.