Tata Sons Chairman Chandrasekaran Resigns:ఆగస్టు 12, 2026 ఉదయం దేశీయ వ్యాపార రంగంలో ఎవరూ ఊహించని వార్త షేర్ మార్కెట్ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ గడువు కంటే ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.
ఆగస్టు 18న జరగాల్సిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందు ఈ రాజీనామా సమర్పించడం వెనుక తీవ్రమైన అంతర్గత సంక్షోభం దాగి ఉందని స్పష్టమవుతోంది. అయితే గ్రూప్ కార్యకలాపాల్లో ఆకస్మిక అస్థిరత రాకుండా ఉండేందుకు, తన ప్రస్తుత టర్మ్ ముగిసే వరకు బాధ్యతల్లో సహాయకారిగా ఉంటానని చంద్రశేఖరన్ బోర్డుకు తెలిజేశారు.
నోయెల్ టాటా కోల్డ్ వార్
చంద్రశేఖరన్ నిష్కృమణకు కేవం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా, గ్రూప్లోని అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలే కీలకమని తెలుస్తోంది. ప్రధానంగా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో ఆయనకు ఉన్న వ్యూహాత్మక వైరుధ్యాలు ఈ సంక్షోభానికి పునాది వేశాయి.
చంద్రశేఖరన్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాటా న్యూ సూపర్ యాప్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇ- కామర్స్ సెమికండక్టర్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ , తక్షణ లాభాలు రాకపోవడంపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాల్సి ఉండగా, దీనిని నోయెల్ టాటా వర్గం వ్యతిరేకించింది. టాటా సన్స్ ఎప్పటికీ ఐపీవోకి తీసుకెళ్లకూడదనే కఠిన షరతుపై సంతకం చేయడానికి చంద్రశేఖరన్ నిరాకరించడం విభేదాలను మరింత ముదిరాయి.
టాటా సన్స్ బోర్డులో టాటా ట్రస్ట్స్కు ఉండాల్సిన ప్రాతినిధ్యం, నిర్వహణ అధికారుల విషయంలో ఛైర్మన్ చంద్రశేఖర్, ట్రస్టీల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లోపించింది.
ఏజీఎం ఓటింగ్ ముప్పు
ఆగస్టు 18న జరగనున్న ఏజీఎంలో చంద్రశేఖరన్ డైరెక్టర్గా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే 66 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్ ప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని సంకేతాలు అందాయి. ఓటింగ్ ద్వారా పదవి నుంచి తొలగించడం కంటే గౌరవప్రదంగా రాజీనామా చేయడమే మేలని చంద్రశేఖరన్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రశేఖర్ 9 ఏళ్లలో సాధించిన విజయాలు
2017లో సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన హయాంలో గ్రూప్ మార్కెట్ విలువ 400 బిలియన్ల మార్కును దాటింది. దశాబ్దాల తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం. టాటా మోటార్స్ను ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో లీడర్గా నిలపడమే కాకుండా, దేశీయ చిప్ తయారీకి పునాదులు వేశారు. ఐటీ రంగంలో టీసీఎస్ లాభాలను స్థిరంగా ఉంచుతూ గ్రూప్ ఆర్థిక పునాదిని బలోపేతం చేశారు.
మార్కెట్ ప్రభావం
చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్ 2.5 శాతం, టాటా మోటార్స్ 3.2 శాతం, టాటా పవర్ 2.9శాతం మేర నష్టపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
తదుపరి బాధ్యతలు ఎవరికి?
ప్రస్తుతం నోయెల్ టాటా పేరు రేసులో ఉన్నప్పటికీ, ఆయన నేరుగా బాధ్యతలు చేపడతారా లేదా మళ్లీ చంద్రశేఖరన్ లాంటి ఒక ప్రొఫెషనల్ లీడర్ను బయటి నుంచి ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
