రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. ఇటీవల జీఎస్టీ తగ్గించిన తరువాత, భారతీయ రైల్వే (Indian Railways) తన ప్రసిద్ధ బాటిల్ వాటర్ బ్రాండ్ అయిన రైల్ నీర్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయించే ఇతర ప్యాక్ చేసిన నీటి ధరలను కూడా తగ్గించింది.
సెప్టెంబర్ 20, 2025న విడుదల చేసిన అధికారిక నోటీసులో రైల్వే బోర్డు అన్ని జనరల్ మేనేజర్లు, ఐఆర్సిటిసి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లకు రైల్ నీర్ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్పి) ఒక లీటరుకు ₹15 నుండి ₹14కి తగ్గించింది. 500 ml బాటిల్కు ₹10 నుండి రూ.9కి తగ్గించాలని సూచించింది. ఈ ధరల సర్దుబాటు రైల్ నీర్కు మాత్రమే కాకుండా, రైల్వే స్టేషన్లలో, రైళ్లలో విక్రయించే ఇతర ఐఆర్సిటిసి (IRCTC), రైల్వే ఆమోదిత బాటిల్ వాటర్ బ్రాండ్లకు కూడా తాజా నిర్ణయం వర్తిస్తుంది.
“ఈ నిర్ణయం ప్రయాణికులకు జీఎస్టీ తగ్గింపు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందిస్తుంది” అని నోటీసులో పేర్కొన్నారు. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. ఇది పన్ను ఆదాను ఆలస్యం చేయకుండా నేరుగా వినియోగదారులకు అందించడానికి భారతీయ రైల్వే నిబద్ధతను సూచిస్తుందని రైల్వేస్ అధికారులు పేర్కొన్నారు.
ఐఆర్సిటిసి ప్రధాన ఉత్పత్తి రైల్ నీర్
2003లో ప్రారంభించిన రైల్ నీర్ ఐఆర్సిటిసికి చెందిన ప్రధాన ఉత్పత్తి. ఇది ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి, రైలు ప్రయాణాల సమయంలో సురక్షితమైన డ్రింకింగ్ వాటర్ అందించడానికి తీసుకొచ్చారు. మొదటి ఉత్పత్తి ప్లాంట్ న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల నుండి ప్రయాణించే ప్రయాణికులకు సేవలు అందించే రాజధాని, శతాబ్ది వంటి ఎక్స్ప్రెస్ ప్రీమియం రైళ్లకు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ఏర్పాటు చేశారని తెలిసిందే.
ఎన్నో ఏళ్ల నుంచి రైళ్లలో నమ్మదగిన, పరిశుభ్రమైన తాగునీటికి రైల్ నీర్ పర్యాయపదంగా మారింది. ఇప్పుడు, తాజాగా ధర తగ్గిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాణిజ్య సర్క్యులర్ నం. 18, 2025 కొత్త ధరల నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అన్ని భారతీయ రైల్వే శాఖలు, ఐఆర్సిటిసి అవుట్లెట్లు వెంటనే మార్పులను అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రయాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే బాటిల్ వాటర్ వంటి రోజువారీ వస్తువులపై స్వల్పంగా తగ్గించడం ప్రయాణికులకు మార్పును సూచిస్తుంది. ఆన్ లైన్ పేమెంట్ చేస్తే చిల్లర సమస్య ఉండదు. లేకపోతే మీరు పాత ధరకే కొనాల్సి వస్తుంది. రైల్ నీర్ ధర తగ్గింపు భారతదేశం అంతటా లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చనుంది.