Construction Sector: 


దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో రంగం రియల్‌ ఎస్టేట్‌ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా, రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఛార్టెడ్‌ సర్వేయర్స్‌ సర్వే తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారని వివరించింది. 2030 కల్లా వీరి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని వెల్లడించింది.


భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉత్పత్తి 2030 కల్లా ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న 650 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. ఈ రంగం మరింత జోరు అందుకోవాలంటే ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచాలని సూచిస్తోంది. భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలకు, ఇప్పటికీ ఎంతో అంతరం ఉందని వెల్లడించింది.


రియల్‌ ఎస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం వృద్ధి చెందుతుండటంతో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది. నిర్మాణ రంగంలో టెక్నాలజీ వినియోగంతో వేగం పెరిగిందని, వాటిని ఉపయోగించగలిగే ఉద్యోగుల అవసరం పెరిగిందని వెల్లడించింది.


ప్రస్తుతం దేశంలో అత్యధిక మంది ఉపాధి కల్పిస్తున్న రెండో రంగం రియల్‌ ఎస్టేట్‌ అని నైట్‌ఫ్రాంక్‌ సర్వే తెలిపింది. 2023 నాటికి మొత్తం 7.1 కోట్ల మంది పనిచేస్తున్నారని అంచనా వేసింది. ఇందులో 81 శాతం మందికి నైపుణ్యాలు లేవని, 19 శాతం మందికే నైపుణ్యాలు ఉన్నాయని వెల్లడించింది.


డెవలపర్లు, నిర్మాణ రంగ కంపెనీలు, కన్సల్టింగ్‌ సహా ఇతర కంపెనీల నుంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోందని సర్వే తెలిపింది. ప్రభుత్వ చొరవ, అకాడమిక్‌, ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్ల నుంచే వీరిని తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని సూచించింది.


Also Read: బియ్యమో రామచంద్రా అంటున్న ప్రపంచ దేశాలు, USలో పరిస్థితి ఎలా ఉంది?


నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (NSDC) ప్రకారం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 87 శాతం స్థిరాస్తి మిగిలిన 13 శాతం మంది మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న 7.1 కోట్ల మందిలో 44 లక్షల మంది ఇంజినీర్లు, టెక్నీషియన్స్‌, క్లెరికల్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. 70 లక్షల మంది వొకేషనల్‌గా ట్రైనింగ్‌ పొందినవారు. స్థిరాస్తి రంగం తన అసలైన సత్తా చాటాలంటే నైపుణ్య అంతరం పూడ్చాలని సర్వే నొక్కి చెప్పింది. అప్పుడే ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యాలు చేరుకోగలమని పేర్కొంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.