Silver Price Today: ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి, ప్రతి రోజూ కొత్త గరిష్టాన్ని తాకుతున్నాయి. వెండి కూడా వేగంగా పెరుగుతోంది, రికార్డ్‌ స్థాయికి చేరింది. ఎల్లో మెటల్‌, సిల్వర్‌ మెరుపుల వెనుక చాలా కారణాలున్నాయి. వెండి కిలో లక్ష రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌ల అంచనా.


2024 సంవత్సరంలో భారీ జంప్‌
స్థూల ఆర్థిక కారణాలతో పాటు, ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధాలు బంగారం, వెండి ధరల ర్యాలీకి కారణంగా మారాయి. ముఖ్యంగా, యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (US FED) తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్లు స్వర్ణం, రజతం రేట్లను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో, ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో 3 దఫాలుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ ఇటీవల హింట్‌ ఇచ్చారు. దీంతో, గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్లు, ఇతర గవర్నమెంట్‌ సెక్యూరిటీల నుంచి డబ్బు వెనక్కు తీసుకుని పసిడిలోకి పంప్‌ చేస్తున్నారు. ఇదే కారణం వల్ల వెండి కూడా లాభపడుతోంది. 


2023లో బంగారం ధరలు దాదాపు 13 శాతం పెరిగాయి. వెండి ధర సుమారు 7.19 శాతం పెరిగింది. 2024 డేటాను పరిశీలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 08 వరకు, సిల్వర్ సుమారు 11 శాతం పెరిగింది, గోల్డ్‌ దాదాపు 15 శాతం జంప్‌ చేసింది.


వెండి మెరుపు ఇప్పట్లో తగ్గకపోవచ్చు!
పసిడి, వెండి మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ వేగం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చెప్పింది. భవిష్యత్‌లో వెండి కిలోకు రూ.92 వేల నుంచి రూ.లక్ష వరకు చేరవచ్చని లెక్కగట్టింది.


ఈ రోజు (మంగళవారం, 08 ఏప్రిల్ 2024), హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 65,750 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 53,800 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 88,000 గా ఉంది. 


దిల్లీలో (Gold Rate in Delhi) ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 65,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,770 గా నమోదైంది. చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 66,600 కు, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,650 కు చేరాయి. ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 65,750 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 71,730 దగ్గర ఉన్నాయి. అయితే, ఇవి గోల్డ్‌ ఫ్యూచర్స్‌. స్పాట్‌ గోల్డ్‌ రేట్లకు వీటికి కొంత తేడా ఉంటుంది.


స్పాట్‌ రేట్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,400 వరకు పలుకుతోంది. కిలో వెండి రేటు ₹ 85,000 గా ఉంది.


ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ పెట్టుబడిదార్లను రక్షణాత్మక వైఖరి వైపు నెడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గడంతో... తమ దేశాల మీద ఆ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వివిధ కేంద్ర బ్యాంక్‌లు భారీ స్థాయిలో బంగారం కొని నిల్వ చేసుకుంటున్నాయి. అందుకే, సేఫ్‌ హెవెన్‌ గోల్డ్‌కు డిమాండ్‌ పెరిగింది. పసిడి కొంటున్న వాళ్లే వెండి మీదా నమ్మకం పెడుతున్నారు. అంతేకాకుండా... దేశీయంగా & అంతర్జాతీయంగా తయారీ రంగం ఊపందుకుంది. తయారీ రంగంలో, ముఖ్యంగా ఆటోమోటివ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్‌ విభాగాల్లో వెండిని విరివిరిగా ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా రజతం కొనుగోళ్లు పెరిగాయి. సౌరశక్తికి డిమాండ్ పెరగడం వల్ల కూడా వెండి మెరుపులు పెరిగాయి.



మరో ఆసక్తికర కథనం: తగ్గని పసిడి దూకుడు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి