Dronacharya Aerial Innovations IPO: ఇవాళ (శుక్రవారం, 23 డిసెంబర్‌ 2022) డిస్కౌంట్‌లో లిస్టయిన ల్యాండ్‌మార్క్ కార్స్‌, అబాన్స్ హోల్డింగ్స్ షేర్లు IPO ఇన్వెస్టర్లను ఏడిపిస్తే... ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO మాత్రం పెట్టుబడిదారుల్లో సంతోషం నింపింది. ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ (Dronacharya Aerial Innovations) స్టాక్‌ ఇవాళ BSEలోని SME ఫ్లాట్‌ఫాంలో లిస్ట్‌ అయింది. 


భారీ లిస్టింగ్‌ గెయిన్స్‌
ఈ కంపెనీ IPO ఇష్యూ ప్రైస్‌ రూ. 54 అయితే, BSEలో ఒక్కో షేరు రూ. 102 వద్ద, 90 శాతం ప్రీమియంతో ప్రారంభమైంది. ఇవాళ మార్కెట్‌ ఎదురుగాలి గట్టిగా వీస్తున్నా, లిస్టింగ్‌ తర్వాత కూడా షేర్లు బలంగా ఎగిరాయి. రిపోర్టింగ్‌ సమయానికి,
ఒక్కో షేరు రూ. 50-55 ప్రీమియంతో చేతులు మారుతోంది, ఇది దాదాపు 100 శాతం లిస్టింగ్ గెయిన్స్‌ను సూచిస్తోంది. దీని ప్రీమియం గరిష్టంగా రూ. 75 వరకు వెళ్లింది. 


2022 డిసెంబర్ 13-15 తేదీల మధ్య ఈ SME ప్లేయర్ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఒక్కో షేరును రూ. 52-54 ప్రైస్‌ రేంజ్‌లో అమ్మి రూ. 33.97 కోట్లను సేకరించింది. ఆ ప్రైస్‌ రేంజ్‌లో, ఒక్కో లాట్‌కు 2,000 షేర్ల చొప్పున విక్రయించింది.


IPOకి అత్యంత భారీ స్పందన
ఈ ఇష్యూకి పెట్టుబడిదారుల నుంచి అత్యంత భారీ స్పందన వచ్చింది. దాదాపు రూ. 34 కోట్ల IPOలో, షేర్లు కావాలంటూ వచ్చిన మొత్తం దరఖాస్తులను లెక్కిస్తే, వాటి విలువ రూ. 8285.8 కోట్లుగా తేలింది. ఇది రికార్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌. ఈ IPO మొత్తం 243.7 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ కోటాలో 330.82 రెట్ల బిడ్‌లు వచ్చాయి. HNIల భాగం 287.8 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ పొందింది, అర్హత కలిగిన పెట్టుబడి సంస్థల (QIBs) కోటా 46.2 రెట్లు బుక్ అయింది. షేర్లు కావాలంటూ వచ్చిన మొత్తం దరఖాస్తులను లెక్కిస్తే, వాటి విలువ రూ. 8285.8 కోట్లుగా తేలింది. 


పుణె కేంద్రంగా పని చేసే ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్‌లో ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ పెట్టుబడులు పెట్టారు.


ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్‌ను 2017లో స్థాపించారు. మల్టీ సెన్సార్ డ్రోన్ సర్వేలు, హై కాన్ఫిగరేషన్ వర్క్‌ స్టేషన్‌లను ఉపయోగించి డ్రోన్ డేటా ప్రాసెసింగ్, డ్రోన్ పైలట్ శిక్షణ, ప్రత్యేక GIS శిక్షణ వంటి హై-ఎండ్ డ్రోన్ సొల్యూషన్లను ఈ కంపెనీ అందిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.