న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం భారత్ సహా పలు దేశాల్లో సెగలు రేపుతోంది. ఈ క్రమంలో భారత్లో మధ్యతరగతి, సామాన్య ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder) ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈసారి ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల వరుస పెరుగుదలతో సామాన్యుల వంటగది బడ్జెట్పై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 913 నుంచి 942కు చేరుకుంది. జూన్ 7 నుంచి ఈ ధర అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965 నుంచి రూ.994 అయింది.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు, వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల (19 KG) ధరలు కూడా గత నాలుగు నెలలుగా నిరంతరం పెరుగుతున్నాయి. వ్యాపార రంగంపై ప్రభావం చూపిన గత నాలుగు నెలల కమర్షియల్ సిలిండర్ ధరల హెచ్చుతగ్గుల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరిలో రూ.111 చొప్పున పెంచారు.
ఫిబ్రవరి 2026: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.49 పెంచారు.
మార్చి 2026: ఆర్థిక సంవత్సరం ముగింపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.144 మేర పెంచారు.
ఏప్రిల్ 2026: హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా రూ.194 మేర పెంచాయి.
మే 2026: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరల ఒత్తిడి పెరిగి, ఈ నెలలో కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.9993 మేర అదనపు భారాన్ని మోపారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుకొత్త నెల ప్రారంభంలోనే వినియోగదారులపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అదనపు భారాన్ని మోపాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 1 నుండి ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈసారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై దేశవ్యాప్తంగా సగటున రూ. 42 మేర పెంపును వర్తింపజేశారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఈ నెల ప్రారంభంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్కు జరుగుతున్న ఇంధన దిగుమతుల ఖర్చులు భారీగా పెరగడంతో, దేశీయ గ్యాస్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఈ ధరల పెంపునకు దారితీసింది. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశంలోని వివిధ ప్రధాన నగరాలపై విభిన్నంగా పడింది.
Also Read: సరైన ITR ఫారమ్ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి
వివిధ నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల రిటైల్ ధరల వివరాలు:
హైదరాబాద్: ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర అత్యధికంగా రూ. 52 మేర పెరగడంతో, ప్రస్తుతం దీని రిటైల్ ధర రూ. 3,367 కి చేరుకుంది.
ఢిల్లీ: దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ. 42 పెరగడంతో, అక్కడ దీని ధర రూ. 3,113.50 గా నమోదైంది.
కోల్కతా: ఇక్కడ రూ. 53.50 మేర పెరిగిన ధరతో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ. 3,255.50 కి చేరింది.
