7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదార్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కరవు భత్యం లేదా డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 38 శాతం కరవు భత్యం అందుతోంది. తాజా 4 శాతం పెంపుతో కలిపి అది 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం (Gross Pay & Net Pay) కూడా పెరుగుతుంది. దీంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే పింఛను మొత్తం కూడా పెరుగుతుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. 


ఏటా రెండు సార్లు పెంపు         
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు కరవు భత్యాన్ని సవరిస్తుంది. మొదటి పెంపు జనవరిలో, రెండో పెంపు జులైలో ఉంటుంది. తద్వారా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభిస్తుంది.


డీఏ పెంపునకు ఒక ప్రామాణిక పద్ధతి ఉంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే "కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్" [Consumer Price Index for Industrial Workers - CPI(IW)] ఆధారంగా డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన అనుబంధ విభాగమే ఈ లేబర్ బ్యూరో. 


2022 డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ 2023 జనవరి 31న విడుదల అయ్యింది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాల్సి ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం, పాయింట్ తర్వాత ఉన్న నంబర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల, పాయింట్‌ తర్వాత ఉన్న 23 నంబర్‌ను వదిలేసి, డీఏను నికరంగా 4 శాతం పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా ఈ పెంపుదల జరిగింది. 


పెరిగిన DA ఎప్పటి నుంచి వర్తింపు?              
కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA), పెన్షనర్ల డియర్‌నెస్ రిలీఫ్ ‍‌(DR) పెంపు నిర్ణయం జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 12,815.60 కోట్ల భారం పడుతుంది. 


కొత్త DAతో కలిపి జీతం ఎంత పెరుగుతుంది?                               
డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంపుతో కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఉదాహరణకు... ఒక కేంద్ర ఉద్యోగి మూల వేతనం రూ. 25,500 అనుకుందాం. 38 శాతం డీఏ ప్రకారం ఇప్పుడు రూ. 9,690 అందుతోంది. డీఏ 42 శాతంగా మారితే డియర్‌నెస్ అలవెన్స్ రూ. 10,710 కి పెరుగుతుంది. అంటే ప్రతి నెలా జీతం రూ.1,020 పెరుగుతుంది.