News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Crypto Tax In India: క్రిప్టోపై పన్నులు నియంత్రణకా? అవగాహన పెంచడానికా ?

ఇండియాలో క్రిప్టో కరెన్సీ చట్టబద్దమా కాదా అన్నదానిపైచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం ముఫ్పై శాతం పన్ను విధించిది. భారత్‌లో క్రిప్టోలో పెట్టుబడులు లక్షల కోట్లకు చేరుకున్నాయి.

FOLLOW US: 
Share:

 

Crypto Tax In India:  క్రిప్టో కరెన్సీ .. ఇప్పుడు ప్రపంచం మొత్తం  హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా క్రిప్టో ట్రేడింగ్ నడుస్తోంది. మన దేశంలోనూ వాటి హవా ప్రారంభమయింది. అందుకే ప్రభుత్వం ముఫ్పై శాతం వరకూ పన్ను విధించింది.  ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏదైనా క్రిప్టో కరెన్సీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు. రెండు మూడు నెలల తరువాత మీరు పెట్టిన లక్ష రూపాయలు కాస్త రెండు లక్షలు అయింది. అంటే ఇక్కడ మీ లాభం లక్ష రూపాయలు. లక్షలో 30శాతం అంటే 30వేల రూపాయలు మీరు ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. అసలు డిజిటల్ కరెన్సీలకు అనుమతించే ప్రశ్నే లేదంటున్న కేంద్రం పన్ను మాత్రం విధించింది.  

క్రిప్టో కరెన్సీ ఏమిటి ? 

సటొషి నకమొటొ అనే పేరుతో  2009 జనవరి 3వ తేదీన.. సటోషి బ్లాక్‌చెయిన్ వ్యవస్థను ఆధారంగా పనిచేసే తొలి క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్‌'ను తయారుచేశారు. ఈ నెట్‌వర్క్ క్రమంగా ప్రధాన స్రవంతిలోకి వస్తుండగా.. సటోషి 2011లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆ పేరుతో ఎలాంటి ప్రకటనలూ రాలేదు. 2011 వరకూ బిట్‌కాయిన్ ఒక్కటే ఏకైక క్రిప్టోకరెన్సీగా ఉండేది. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు లైట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ క్రిప్టోకరెన్సీని తయారుచేయటం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో పది వేల వరకూ క్రిప్టోకరెన్సీలు ఉన్నట్లు అంచనా. ఈ క్రిప్టోకరెన్సీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

కంప్యూటర్ మైనింగ్ ద్వారా క్రిప్టో కరెన్సీ సృష్టి ! 

క్రిప్టో అంటే.. క్రిప్టోగ్రఫీ అనే కంప్యూటర్ సాంకేతిక శాస్త్రానికి సంక్షిప్త రూపం. ఇంటర్నెట్‌ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి, దాచిపెట్టుకోవటానికి ఈ క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తారు. అంటే ఎన్‌క్రిప్ట్ అయిన సమాచారం.. దానికి సంబంధించిన పాస్‌వర్డ్ తదితర అనుమతులు లేనిదే డిక్రిప్ట్ కాదు. ప్రభుత్వ నియంత్రణ కానీ, బ్యాంకుల మధ్యవర్తిత్వం కానీ ఏవీ లేనిసురక్షితంగా బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీని  క్రిప్టో.   ఈ కరెన్సీని ఏ ప్రభుత్వమూ జారీ చేయదు. ఇది ఏ బ్యాంకు నియంత్రణలోనూ ఉండదు. ఇది చాలా పకడ్బందీగా రూపొందించిన ఓపెన్‌సోర్స్ కంప్యూటర్ ఆల్గారిథమ్ ఆధారిత నెట్‌వర్క్ ద్వారా నడుస్తుంది.క్రిప్టోకరెన్సీని దాని వినియోగదారులే నియంత్రించుకుంటారు.
 
  భారత్‌లో క్రిప్టో కరెన్సీ క్రేజ్  !

క్రిప్టోకరెన్సీలను భారతదేశంలో నిషేధిస్తూ 2018 ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు 2020 మార్చిలో కొట్టివేసింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ విలువ అమాంతంగా పెరిగిపోతుండటంతో దీనిపై భారతీయుల ఆసక్తి కూడా పెరిగింది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ యజమానులు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ఉన్నారు.  దేశంలోని క్రిప్టో ట్రేడర్లలో ఎక్కువ మంది 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారేనని పలు ఎక్సేంజ్ సంస్థలు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే నెలకు ఒక్కొక్కరు సగటున 10,000 రూపాయలు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారని అంచనా.

క్రిప్టోల విషయంలో కేంద్రం భిన్న వైఖరి ! 

బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల మీద పన్ను వేయడం ద్వారా కొత్త తరం ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడి మార్గాలను గుర్తిస్తామనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపింది. క్రిప్టో కరెన్సీల గుర్తింపుపై భారత్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దీన్నొక కీలక పరిణామంగా చూడొచ్చు.ఎవరి నియంత్రణ లేని క్రిప్టో కరెన్సీల మీద కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఇప్పుడు క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే ఆదాయంపై ప్రభుత్వం పన్ను వేస్తోంది అంటే ఇకపై అవి చట్టబద్ధమేనా అనే ప్రశ్న వస్తోంది. కానీ బిట్‌కాయిన్ వంటి వాటిని వర్చువల్ డిజిటల్ అసెట్స్‌గా చూసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది తప్ప క్రిప్టో కరెన్సీలుగా గుర్తించేందుకు సిద్ధంగా లేదు.  పన్ను వేస్తున్నంత మాత్రాన క్రిప్టో కరెన్సీలు ఇంకా దేశంలో లీగల్ కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కూడా స్సపష్టం చేశారు.  

క్రిప్టోవైపు భారీగా ఆకర్షితులవుతున్న జనం 

భారత్‌లో లక్షలు కాదు కోట్ల మంది ఇలాంటి క్రిప్టోకరెన్సీల్లో డబ్బులు పెట్టేశారు. దేశంలోని కొన్ని కోట్ల మంది పెట్టుబడిదారులు దాదాపు రూ.6 లక్షల కోట్ల డబ్బు క్రిప్టోకరెన్సీలో పెట్టారనే అంచనా ఉంది.  6 లక్షల కోట్లు అంటే అది చాలా పెద్ద మొత్తం. దేశ జీడీపీలో మూడు శాతం. గత బడ్జెట్‌లో దాదాపు ఐదో భాగం. దేశంలో ఇంత మొత్తం క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిగా పెట్టారా? ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ వ్యాపారం ఆన్‌లైన్ అయినప్పటికీ, ఒక విధంగా అది అండర్‌గ్రౌండ్ వ్యాపారం కూడా. అందుకే కేంద్రం నియంత్రించాలనుకుంటోంది. 

నియంత్రణ లేని వ్యాపారంతో మొదటికే మోసం ! 

క్రిప్టో  వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోందని, ఎలాంటి నియమ నిబంధనలూ లేకుండా, ఇది ఇలాగే పగ్గాలు లేకుండా ముందుకెళ్తే, ముందు ముందు ఏదో కష్టకాలం వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ వ్యాపారానికి కళ్లెం వేసే సన్నాహాల్లో ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి అనుమతి ఉంది. అయితే, వాస్తవానికి ఒకటి రెండు దేశాలు తప్ప దీనిని ఏ ప్రభుత్వమూ అధికారికంగా తమ లావాదేవీల్లో ఉపయోగించట్లేదు. రూపాయికి భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇలా బిట్ కాయిన్‌కు ఏ ప్రభుత్వమూ హామీ ఇవ్వలేదు. అందుకే  పన్ను ద్వారా నియంత్రణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది. 

Published at : 10 Aug 2022 01:40 PM (IST) Tags: Independence Day cryptocurrency crypto Cryptocurrency News Crypto News