Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026లో కీలక మౌలిక వసతుల ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్ల(7 High-Speed Rail Corridors)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్- అమరావతి మీదుగా చెన్నైకు వెళ్తోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన ఆమె.. ఈ హై-స్పీడ్ రైలు కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, వ్యాపారం, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనిలో భాగంగా.. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  • పుణె - హైదరాబాద్
  • ముంబయి - పుణె
  • హైదరాబాద్ - బెంగుళూరు
  • హైదరాబాద్ - చెన్నై
  • ఢిల్లీ - వారణాసి
  • వారణాసి - సిలిగుడి

ఇవి నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. దేశంలో 7 నగరాలను కలుపుతూ వేస్తోన్న ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌లో హైదరాబాద్​ను మూడు కారిడార్లు కలుస్తాయి. ఈ రైలు కారిడార్లు అమలులోకి వస్తే.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందడమే కాకుండా.. లాజిస్టిక్స్ రంగానికి కూడా బలమైన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిర్మాణ దశలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.