Millets: 


కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని పండించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. బడ్జెట్‌-2023లో 'అన్నామృతం'గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్‌ చేసిందంటే?


బ్రిటిషర్లు దేశంలోఅడుగుపెట్టనంత వరకు భారతీయులు నిత్యం చిరుధాన్యాలే ఆహారంగా తీసుకొనేవారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అప్పటి వరకు వరికి ప్రాధాన్యమే లేదు. దేశవ్యాప్తంగా అపరాల వంటి పంటలనే పండించేవారు.


వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు డబ్బుల కోసం పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. రైతులు క్రమంగా వీటికి అలవాటు పడటంతో చిరుధాన్యాల దిగుబడి తగ్గిపోయింది. స్వాత్రంత్యం వచ్చాక ఆహార భద్రత కోసం వరి, గోధుమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.


పౌర సరఫరా వ్యవస్థలోనూ వరి, గోధుమలకే పెద్దపీట వేశారు. ఫలితంగా తృణధాన్యాలు పండించడం మరింత తగ్గింది. అయితే విపరీతంగా వరన్నం తినడంతో భారతీయుల్లో ఊబకాయం రోజురోజుకీ పెరుగుతోంది. చాలామంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. యువత సైతం ప్రీ డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతోంది.


ఇదే సమయంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని అందించే పంటలపై ఆసక్తి పెరిగింది. రాగులు, సజ్జలు, అరికెలు, ఊదల వంటి తృణధాన్యాలు తిన్న తర్వాత మెల్లగా గ్లూకోస్‌ను విడుదల చేసే సంగతి తెలిసిందే. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతున్నాయి. డయాబెటిస్‌ ముప్పు తగ్గుతోంది.


భారతీయుల ఆరోగ్యంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌కు అవకాశం దొరికింది. అందుకే ఐక్య రాజ్య సమితితో ఈ ఏడాదిని 'తృణధాన్యాల సంవత్సరం'గా ప్రకటించేలా పావులు కదిపారు.


టాటా కన్జూమర్స్‌, ఐటీసీ వంటి బ్రాండ్లు తృణధాన్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తృణధాన్యాలతో ఇడ్డీరవ్వ, ఉప్మా రవ్వా, దోసె పిండి, బిస్కెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా ఐటీసీ తమ హోటళ్లలో తృణధాన్యాల భోజనాలను ప్రవేశపెట్టబోతోందని తెలిసింది.


చిరు ధాన్యాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు 12-15 శాతం తగ్గుతాయి! అలాగే ఒక కిలో ధాన్యాలను పండించేందుకు 650-1200 లీటర్ల నీరు సరిపోతుంది. అదే ఒక కిలో బియ్యానికి 5000 లీటర్ల నీరు అవసరం. పైగా విటమిన్లు, ఖనిజాలు దేహానికి లభిస్తాయి. వివిధ సూక్ష్మపోషకాలు దొరుకుతాయి.


భవిష్యత్తులో నీటి అవసరం పెరుగుతుంది. అలాంటప్పుడు తక్కువ నీరు ఉపయోగించుకొనే పంటలను ప్రోత్సహించాలి. పైగా ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలంటే చిరుధాన్యాలు తినక తప్పదు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే పీడీఎస్‌లో భాగంగా రాగుల వంటి చిరుధాన్యాలు అందిస్తున్నాయి. కర్ణాటకలో చిరుధాన్యాలను మార్కెట్‌ ధరకన్నా 40 శాతం ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పండించాలని రైతులను కోరుతోంది.


దేశంలో 1961లో 18.5 మిలియన్‌ హెక్టార్లలో చిరుధాన్యాలను పండిచేవారు. 2019లో వీటి విస్తీర్ణం 8.5 మిలియన్లకు తగ్గిపోయింది. ఒకప్పుడు తలసరి వినియోగం 33 కిలోలు ఉండగా ఇప్పుడు 4 కిలోలకు తగ్గిపోయింది.


భారత్‌లో చాలామంది మహిళలు రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్నారు. 80 శాతం మంది భారతీయుల్లో సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తోంది. సరైన పోషకాలు లేకపోవడంతో చిన్నారులు వయసుకు తగినట్టుగా ఎదగడం లేదు. వీరికి వైద్యం అందించకపోవడం వల్ల రోజుకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తోంది.


రైతులు చిరు ధాన్యాల వైపు మళ్లడం అంత సులభం కాదు. ఒక ఎకరంలో రూ.2000 ఖర్చు చేస్తే 35-45 క్వింటాళ్ల వరి దిగుబడి వస్తుంది. అదే 6-7 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడికి రూ.3000 వరకు ఖర్చవుతుంది. అన్నదాతలకు సరైన లాభదాయతను చూపిస్తేనే ప్రభుత్వ లక్ష్యం విజయవంతం అవుతుంది.