Apple Delhi Saket Store Open: దిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ సాకేత్‌లో, ఆపిల్ రెండో రిటైల్‌ స్టోర్ కూడా ఇవాళ (గురువారం, 20 ఏప్రిల్‌ 2023) ప్రారంభమైంది. ఆపిల్ సిబ్బంది, సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) చప్పట్లు కొడుతూ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. టిమ్‌ కుక్‌, భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్కారం చేస్తూ వినియోగదార్లకు ఆహ్వానం పలికారు. 


జనసందోహం కేరింతల నడుమ ప్రారంభోత్సహం
ఆపిల్‌ రెండో రిటైల్ స్టోర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. టిమ్ కుక్‌ను కలవడానికి, ఆపిల్ రిటైల్ స్టోర్‌లోకి వెళ్లడానికి ఉదయం నుంచి వరుసలో వేచి చూశారు. సాకేత్‌ ప్రాంతంలో ఉన్న సిటీ వాక్ మాల్‌లో ఈ స్టోర్‌ ప్రారంభమైంది. ఈ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు. స్టోర్‌ ప్రారంభోత్సవం అనంతరం, టిమ్‌ కుక్‌ కొంతమంది వినియోగదార్లతో మాట్లాడారు.






ఆపిల్‌ దిల్లీ స్టోర్‌ మన దేశంలో రెండో రిటైల్‌ స్టోర్‌. కంటే ముందు, మంగళవారం నాడు (18 ఏప్రిల్‌ 2023), మన దేశంలో ఆపిల్‌ తొలి రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో టిమ్‌ కుక్‌ ప్రారంభించారు. అక్కడ కూడా, భారీగా తరలివచ్చిన ప్రజల మధ్య ప్రారంభోత్సరం జరిగింది. ముంబై స్టోర్‌ డోర్‌ను ఓపెన్‌ చేయడం ద్వారా ఆ స్టోర్‌ను టిమ్‌ కుక్‌ లాంచ్‌ చేశారు. ఆపిల్‌ ముంబై స్టోర్‌ను యాపిల్‌ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్‌ ఉంది. ఈ రెండు దుకాణాలను ప్రారంభించడం కోసమే టిమ్‌ కుక్‌ సోమవారం నాడు భారత్‌ వచ్చారు.  


దిల్లీలోని ఆపిల్ స్టోర్ పరిమాణం, ముంబై స్టోర్ కంటే చాలా తక్కువ. దిల్లీ స్టోర్‌ విస్తీర్ణం 8,417.83 చదరపు అడుగులు కాగా, ముంబై స్టోర్‌ విస్తీర్ణం 20,000 చదరపు అడుగులు. అయితే, రెండు దుకాణాల అద్దె దాదాపు ఒకేలా ఉంది. దిల్లీ దుకాణం అద్దె నెలకు రూ. 40 లక్షలు కాగా, ముంబై దుకాణం అద్దె నెలకు రూ. 42 లక్షలు.


దిల్లీ స్టోర్‌లో ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు?
ఆపిల్‌ దిల్లీ దుకాణంలో 70 మంది ఉద్యోగులు ఉన్నారు, అందులో సగానికి పైగా మహిళలు. అదే సమయంలో, ముంబై స్టోర్‌లో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ స్టోర్‌ను స్థానికీకరణ చేశారు. అంటే, భారత స్ఫూర్తి కనిపించేలా తీర్చిదిద్దారు. ఈ స్టోర్‌లో చాలా గేట్లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి నగరం గురించి విభిన్న కథలు చెబుతుంది. ఈ స్టోర్‌లో జీనియస్ బార్ కూడా ఉంది. ఇక్కడ, మీ ఐఫోన్ సెట్టింగ్స్‌ నుంచి ఆపిల్‌ ఐడీ రికవరీ వంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.


ప్రధానిని కలిసిన టిమ్ కుక్
దిల్లీలో ఆపిల్ స్టోర్ ప్రారంభానికి ఒక రోజు ముందు, ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. భారత్‌లో రెట్టింపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరిన్ని పెట్టుబడులు పెడతామని కుక్‌ హామీ ఇచ్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను కూడా టిమ్ కుక్ కలిశారు.