GST Council Meeting: ఇకపై వస్తు, సేవల పన్నులకు (Goods and Services Tax - GST) సంబంధించి జరిగిన అక్రమాల విలువ రూ.2 కోట్లు దాటితేనే, దాని మీద క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని GST కౌన్సిల్‌ నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, దిల్లీలో జరిగిన ద్వారా 48వ GST కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ రూట్‌లో ఈ సమావేశం జరిగింది. క్రిమినల్‌ నేరాల వర్గం నుంచి కొన్ని అక్రమాలను GST కౌన్సిల్‌  మినహాయించింది.


GST కౌన్సిల్‌ సమావేశం అజెండాలోని 15 అంశాలున్నా, సమయం సరిపోక 8 అంశాల మీదే చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పొగాకు, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను, GST అప్పిలేట్‌ ట్రైబ్యునల్ ఏర్పాటు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, కేసినోలు, పాన్‌ మసాలా, గుట్కాల మీద పన్ను విధింపు అంశాలను సమావేశంలో చర్చించాల్సిన ఉన్నా, వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. 


జీఎస్‌టీ నేరాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారు చెల్లించాల్సిన రుసుమును పన్ను మొత్తంలో 25 శాతానికి తగ్గించాలని లా కమిటీ సూచించింది. ప్రస్తుతం ఇది 150 శాతం వరకు ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో కమిటీ ఈ సూచన చేసింది. ఈ విషయాన్ని భేటీలో పరిగణనలోకి తీసుకోలేదు. 


పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతపై GoM ఇచ్చిన నివేదిక మీద కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సి ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ (GSTAT) ఏర్పాటుకు సంబంధించి, ట్రైబ్యునళ్లలో ఇద్దరు జ్యుడీషియల్ సభ్యులు, కేంద్రం  & రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సాంకేతిక సభ్యుడితో పాటు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్‌ పర్సన్‌గా ఉండాలని నివేదిక సూచించింది. సమయాభావం వల్ల ఈ అంశాలు చర్చకు రాలేదు.


క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ కోసం నేర కనీస పరిమితి రూ.2 కోట్లు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో... ఏ అధికారినైనా విధులను నిర్వర్తించకుండా నిరోధించడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించడం, సరైన సమాచారం వెల్లడించకపోవడం, జీఎస్టీ చట్టాల ప్రకారం ఏ కేసులోనైనా ప్రాసిక్యూషన్ ప్రారంభించడం వంటి కొన్ని కేసులను డీక్రిమినలైజ్‌ (క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించడం) చేశారు. క్రిమినల్‌ నేరాల విలువ పరిమితిని రూ. 2 కోట్లకు పెంచారు. అంటే, రూ.2 కోట్ల విలువ మించిన నేరాలనే క్రిమినల్‌ నేరంగా పరిగణనించి, వర్తించే చర్యలు తీసుకుంటారు. ఈ పరిమితి ఇప్పటి వరకు రూ.1 కోటిగా ఉంది. నకిలీ రశీదులు లేదా నకిలీ చలాన్ల అంశంలో విచారణ చేపట్టేందుకు ప్రస్తుతమున్న  ఒక కోటి రూపాయల పరిమితిని యథాతథంగా కొనసాగించారు. 


పొట్టు పప్పులపై సున్నా పన్ను
పొట్టున్న పప్పు దినుసులపై పన్ను రేటును 5 శాతం నుంచి సున్నాకి తగ్గించినట్లు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. పెట్రోలులో కలిపేందుకు రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్‌ ఆల్కహాల్‌ మీద ఇప్పటి వరకు ఉన్న జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రూపే డెబిట్‌ కార్డు, బీమ్‌ యూపీఐ లావాదేవీలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులకు ఇచ్చే ప్రోత్సాహకాల మీద జీఎస్‌టీ వర్తించదని చెప్పారు.


ఆన్‌లైన్‌ గేమింగ్‌ మీద 28% పన్ను
ఆన్‌లైన్‌ గేమింగ్‌కు 28 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు(CBIC) ఛైర్మన్‌ వివేశ్‌ జోహ్రి చెప్పారు. నికర మార్జిన్‌ మీద కాకుండా, ఆటగాడు పందెం కాసే మొత్తం విలువ మీద 28 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కమిటీ సమర్పించిన రిపోర్టు మీద జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో చర్చ జరనప్పటికీ, CBIC ఈ నిర్ణయం తీసుకుంది.