77 ఏళ్ల క్రితం ఆగస్టు 9 ఇదే రోజున జపాన్‌లోని నాగసాకిలో అమెరికా అణుబాంబు విసిరింది. ఆ తెల్లవారుజామున అనేక ఎయిర్-రైడ్ అలారాలు వినిపించాయి. కానీ అలాంటి హెచ్చరికలు ఇప్పుడు చాలా రొటీన్ అయిపోయాయి. అప్పటికే అమెరికన్లు.. జపాన్ నగరాల్లో నెలల తరబడి ఫైర్‌ బాంబింగ్ చేశారు. అందుకే ఆ రోజు ఉదయం పెను విధ్వంసం జరగబోతుందని ఎవరూ ఊహించలేదు.


ఇలా జరిగింది


రెండు B-29 సూపర్‌ ఫోర్ట్రెస్‌లు (భారీ బాంబర్లు) టినియన్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరి కొకురా వద్దకు చేరుకున్నాయి. ఉదయం 9:50 గంటలకు అక్కడ దాడి చేయాలని ప్లాన్ వేశారు. కానీ దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉండటంతో బాంబు టార్గెట్‌ను నిర్దేశించుకునేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో విమానాలు రెండో టార్గెట్‌గా పెట్టుకున్న నాగసాకికి బయలుదేరాయి. ఇక్కడ కూడా మేఘాలు దట్టంగా ఉండటంతో ఎయిమ్ చేయడం కుదరలేదు. కానీ అనుకోకుండా మేఘాలు కాసేపటికి పోవడంతో 'ఫ్యాట్ మ్యాన్' (అణు బాంబు) వదలడానికి సిద్ధమయ్యారు.


లక్షలాది మంది


ఉదయం 11:02 గంటలకు నాగసాకి పై అణుబాంబు దాడి జరిగింది. పేలుడు జరిగిన ఒక నిమిషం లోపే 40,000 మంది మరణించారు. తరువాత ఐదు నుంచి ఆరు నెలల్లో మరో 30,000 మంది గాయాలతో మరణించారు. ఆ ప్రాణనష్టం అంతటితో ఆగలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొంత మంది గాయాల వల్ల, మరికొంత మంది రేడియేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. అణుబాంబు దాడి ఫలితంగా కొన్ని సంవత్సరాలలో కనీసం లక్ష మంది వరకు మృతి చెందారు. 


బాంబు దాడి జరిగిన కేంద్రం నుంచి 2.5 కిలోమీటర్ల లోపు ఉన్న దాదాపు 90 శాతం భవనాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ దాడి జరిగిన మరుసటి రోజు అంటే ఆగస్టు 10న చక్రవర్తి సూచనల మేరకు జపాన్ ప్రభుత్వం మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోతున్నట్లు తెలియజేసింది. అయితే షరతులు లేని లొంగుబాటు కావాలని అమెరికా పట్టుబట్టింది. ఆగస్ట్ 15న చక్రవర్తి హిరోహిటో.. ప్రజలకు నేరుగా జపాన్ లొంగిపోతున్నట్లు మొదటి సారి ప్రకటించారు.


సెప్టెంబరు 2 న లొంగుబాటు పత్రంపై జపాను ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. లక్షకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చనీయాంశంగానే ఉంది.


హిరోషిమా దాడి


హిరోషిమా దాడితో పోలిస్తే నాగసాకిపై అణు బాంబు దాడిని చాలా మంది పెద్దగా గుర్తించరు. ఇందుకు కారణం నాగసాకిపై దాడికి మూడు రోజుల ముందు హిరోషిమాపై దాడి జరగడమే. ఆ దాడితోనే మానవాళి అణు యుగంలోకి అడుగుపెట్టింది.


'లిటిల్ బాయ్' అనే అణుబాంబును హిరోషిమాపై అమెరికా వేసింది. ఆ పేలుడు సమయంలో 70,000 మంది క్షణాల్లో మసైపోయారు. నగరం మొత్తం శ్మశానవాటికలా మారింది. ఆ విస్ఫోటనం వల్ల ప్రసరించిన కాంతికి కొంతమంది చూపు కోల్పోయారు. ఇది అత్యంత దారుణమైన ఘటన.


అప్పటి అమెరికా సైన్యాధికారుల చెప్పిన ప్రకారం జపాన్ ప్రజలు మొత్తం వారి టార్గెట్. అయితే హిరోషిమా దాడిలో మృతి చెందిన వారిలో 250 మంది మాత్రమే సైనికులు. అంటే మిగిలిన వాళ్లంతా సామాన్య ప్రజలు. ఇంతటి విధ్వంస కాండ సృష్టించిన అమెరికాపై అంతర్జాతీయ చట్టాల కింద ఆంక్షలు విధించవచ్చు. యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే అపవాదులు వేయొచ్చు. కానీ అమెరికా మాత్రం ఇదంతా యుద్ధంలో భాగం అంటూ సింపుల్‌గా చెప్పేసింది.


ఎలా సమర్థించుకుంది?


ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ఈ అణుబాంబు దాడులపై 2015లో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 56 శాతం మంది అమెరికన్లు ఈ అణుబాంబు దాడులకు మద్దతిచ్చారు. మరో 10 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. అయితే చాలా మంది ఇప్పటికీ వాదించే మాట ఏంటంటే "యుద్ధంలో దేనికీ తావు లేదు". ఇంకొంతమంది ఈ అణుబాంబులు ప్రాణాలను కాపాడాయని కూడా వాదిస్తారు. 


అంటే ఇక్కడ ఒకరు ఇతరుల ప్రాణాలను తీసేయడం ద్వారా జీవితాలను కాపాడుకుంటారు. అంటే ఉదాహరణకు అమెరికా అణుదాడి చేయకపోయి ఉంటే సాధారణ యుద్ధం చేయాల్సి వచ్చేది. "చివరి జపాన్ వాసి కూడా యుద్ధం చేస్తాడు కానీ లొంగిపోడు" అని అప్పటికే అమెరికాకు అర్థమైంది. అంటే సాధారణ పౌరులు కూడా యుద్ధం చేస్తారు అని అమెరికా వాదన. అలాంటి యుద్ధమే జరిగితే జపాన్‌లో ప్రతి ఒక్క పౌరుడు చనిపోతాడు. అదే జరిగితే చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో విధ్వంసం జరిగి ఉండేదని అమెరికా ఇప్పటికీ చెప్పుకొస్తుంది.


నైతికత ఏంటి?


అయితే ఎంతో మంది జీవించే హక్కును ఈ దాడులు కాలరాశాయనేది వాస్తవం. అయితే ఈ యుద్ధంలో అణుబాంబుల వాడకంపై నైతికత ఇప్పటికీ ప్రశార్థకమే. హిరోషిమా దాడి మన ఆధునిక యుగంలో అతిపెద్ద నేరంగా చాలా మంది పరిగణిస్తారు. అదే పెద్ద నేరం అంటే నాగసాకిపై అణుబాంబు దాడిని ఏమనాలి?


అసలు అమెరికన్లు రెండవ అణు బాంబు ఎందుకు వేయవలసి వచ్చింది? జపాన్ లొంగిపోవడానికి మరికొన్ని రోజులు అమెరికా ఎందుకు ఆగలేకపోయింది? అయితే దీనికి కూడా అమెరికాకు ఓ వాదన ఉంది. హిరోషిమా బాంబు దాడి జరిగిన వెంటనే జపనీయులు లొంగిపోలేదు. అమెరికన్లతో పోరాడుతూనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అమెరికా వద్ద ఒకే ఒక అణుబాంబు ఉందని జపాన్ నమ్మి ఉండొచ్చు. అందులోనూ యుద్ధంలో ఇంత ఘోర పరాజయం యోధులకు నచ్చదని అమెరికా చెప్పుకొచ్చింది.


మరోవైపు అమెరికా కూడా తమ వద్ద మరో అణుబాంబు ఉంది కదా.. ఇది వాడకపోతే ఎలా అన్నట్లు ప్రయోగించింది అనే వాదన కూడా ఉంది. అయితే అణు బాంబు దాడులు జపాన్‌ను లొంగిపోయేలా చేశాయని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే అప్పటికే అమెరికా.. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. అప్పటికే జపాన్.. అణుబాంబు దాడులతో పూర్తిగా అతలాకుతలమైంది. 


హిరోషిమా, నాగసాకి ఘటనలతో అమెరికా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాలను ప్రపంచదేశాలకు ఇచ్చిందని కొంతమంది చెబుతారు. అయితే అమెరికా సహా చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. "నాగసాకిపై దాడి చేయడం నేరం"


 - వినయ్ లాల్, రచయిత, బ్లాగర్, కల్చరల్ క్రిటిక్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (యూసీఎల్ఏ)            



[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]