Harley Davidson: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం భారత్‌లో హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్లను చౌకగా చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అంచనాలు వేసుకుంటున్నారు. కానీ చేదు నిజం ఏంటంటే... ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. హార్లే-డేవిడ్సన్ అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ మోటార్ సైకిల్ కంపెనీలలో ఒకటి, కానీ వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత వాణిజ్య ఒప్పందం భారత్‌లో హార్లే-డేవిడ్సన్ బైక్ అమ్మకాలపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకుందాం.

హార్లే బైక్‌లు థాయిలాండ్ నుంచి వస్తున్నాయి

ముఖ్యంగా, భారత్‌లో విక్రయించే హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు US నుంచి దిగుమతి కావడం లేదు. కంపెనీ తన దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్లను థాయిలాండ్ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొని వస్తోంది. థాయిలాండ్ హార్లే-డేవిడ్సన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. భారత్‌, థాయిలాండ్ ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి, అంటే ఈ మోటార్ సైకిళ్ళు ఇప్పటికే జీరో టారిఫ్‌ కలిగి ఉన్నాయి. అందువల్ల, US-ఇండియా వాణిజ్య ఒప్పందం కారణంగా ఈ బైక్‌లపై ఎలాంటి టారిఫ్‌ ఎఫెక్ట్ పడదు. అందుకే వాటి ధరల్లో మార్పు ఉండబోదు.  

బైక్‌లపై టారిఫ్‌ తగ్గుతుందా

నైట్‌స్టర్, నైట్‌స్టర్ ఎస్, స్పోర్ట్‌స్టర్ ఎస్, పాన్ అమెరికా వంటి కొన్ని హార్లే-డేవిడ్‌సన్ మోడళ్లు ఈ వర్గంలోకి వస్తాయి. అయితే, ఇవన్నీ థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నందున, వాటి ధరలు తగ్గుతాయని ఆశించడం తప్పే అవుతుంది. యుఎస్‌లో తయారైన హార్లే బైక్‌లు 1600 సిసి కంటే ఎక్కువ కేటగిరీలోకి వస్తాయి. వాటికి ఎటువంటి ఉపశమనం లభించదు.

అమ్మకాలు కూడా పరిమితంగానే

భారత్‌లో ఈ స్థాయి భారీ బైక్‌ల అమ్మకాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి. హార్లే-డేవిడ్సన్ ఏప్రిల్, డిసెంబర్ 2025 మధ్య కేవలం 90 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది కంపెనీ భారత్‌లో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మిగిలిపోయిందని చూపిస్తుంది. హార్లే-డేవిడ్సన్ X440, X440 T వంటి బైక్‌లను భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తారు. స్థానిక ఉత్పత్తి కారణంగా, ఈ మోడళ్లు కూడా దిగుమతి టారిఫ్‌ తగ్గింపునకు అర్హత పొందవు. మొత్తంమీద, US-ఇండియా వాణిజ్య ఒప్పందం నుంచి హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల దరలు తగ్గుతాయని అనుకోవం భ్రమ అవుతుంది. భారత్‌లో విక్రయించే హార్లే బైక్‌లు US నుంచి కాకుండా వేరే దేశం నుంచి దిగుమతి అవుతున్నాయి. కాబట్టి ఈ ఒప్పందం ప్రభావం తక్కువగా ఉంటుంది.