Union Budget 2026 - Auto Industry: కేంద్ర బడ్జెట్‌ 2026-27లో, కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్‌ రంగాన్ని గ్రీన్‌ మొబిలిటీ వైపు తీసుకెళ్లేలా కీలక నిర్ణయాలు ప్రకటించింది. పర్యావరణ హితం, ఇంధన ఆదా, దేశీయ తయారీ ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా CNG, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ తయారీ, ప్రజా రవాణా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Continues below advertisement

CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌

ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆకర్షించిన అంశం CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌. రవాణా అవసరాల కోసం వాడే CNGలో దశలవారీగా కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (CBG)ని తప్పనిసరిగా కలపనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇదే విధంగా, గృహ అవసరాల కోసం ఉపయోగించే PNGలో కూడా ఈ బ్లెండింగ్‌ అమలు చేయనున్నారు. దీనివల్ల దేశంలో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం లభించడంతో పాటు, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Continues below advertisement

ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీల కోసం కీలక నిర్ణయాలు

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోనూ బడ్జెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో EV ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. EVల తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజంలను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. దీని వల్ల ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలపడనుంది.

EV బ్యాటరీల తయారీకి ఊతమిచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ తయారీకి అవసరమైన 35 అదనపు క్యాపిటల్‌ గూడ్స్‌ను కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు జాబితాలో చేర్చారు. అదే విధంగా మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీల తయారీకి అవసరమైన మరో 28 క్యాపిటల్‌ గూడ్స్‌కూ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల దేశీయంగా లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీల తయారీ పెరిగి, ఖర్చు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

కీలక ఖనిజాలపై సుంకం రద్దు

కీలక ఖనిజాల విషయంలోనూ ఆటో ఇండస్ట్రీకి లాభం కలిగే నిర్ణయం తీసుకున్నారు. కోబాల్ట్‌ పౌడర్‌, లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీ స్క్రాప్‌, లీడ్‌, జింక్‌తో పాటు మరో 12 కీలక ఖనిజాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. ఇది గతంలో మినహాయించిన 25 కీలక ఖనిజాలకు అదనం. ఈ చర్య వల్ల తయారీ రంగంలో ముడి సరుకుల లభ్యత పెరిగి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇదే బడ్జెట్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు కూడా పెద్ద ఊరట లభించింది. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చే వడ్డీపై ఆదాయ పన్ను పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అలాగే ఆ వడ్డీపై TDSను పూర్తిగా రద్దు చేశారు. దీంతో బాధితులకు మంజూరైన పరిహారం ఎలాంటి కోతలు లేకుండా మొత్తం వారి చేతికి చేరుతుంది.

మొత్తంగా Union Budget 2026 ఆటో ఇండస్ట్రీని గ్రీన్‌, సస్టైనబుల్‌, దేశీయ తయారీ వైపు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా మారింది. ఈ నిర్ణయాలు రానున్న రోజుల్లో వాహన మార్కెట్‌పై, వినియోగదారుల ఖర్చులపై, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.