Renault Duster Hybrid: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రేనాల్ట్ (Renault), భారత్‌లో తన ఐకానిక్ మోడల్ 'డస్టర్'ను రూ. 10.49 లక్షల నుండి రూ. 18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అధికారికంగా విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ కేవలం టర్బో-పెట్రోల్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. దీపావళి సమయానికి హైబ్రిడ్ వేరియంట్లు రోడ్లపైకి రానున్నాయి. అయితే హైబ్రిడ్ మోడల్ ధరలు ప్రకటించకముందే కస్టమర్ల నుండి ఊహించని స్పందన లభించింది. 2026కి కేటాయించిన మొత్తం హైబ్రిడ్ యూనిట్లు ఇప్పటికే బుక్ అయిపోయిన‌ట్లు స‌మాచారం.

Continues below advertisement

హైబ్రిడ్ వేరియంట్లపై అర్బన్ కస్టమర్ల మొగ్గు

జనవరి 26న డస్టర్ భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన లాంచ్ ఈవెంట్‌లో రేనాల్ట్ ఇండియా వీపీ ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ, హైబ్రిడ్ పవర్‌ట్రైన్ పట్ల కస్టమర్ల ఆసక్తి తమ అంచనాలను మించిపోయిందని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో సుమారు 39 శాతం మంది హైబ్రిడ్ వేరియంట్లనే ఎంచుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం హైబ్రిడ్ ఆర్డర్లను కంపెనీ నిలిపివేసిందని, చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనుల్లో నిమగ్నమై ఉన్నామని వెల్ల‌డించారు. దీపావళి సమయంలో మళ్లీ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.

డస్టర్ సీఎన్‌జీ (CNG) పై అప్డేట్

డస్టర్ బ్రాండ్ ఇమేజ్‌కు సీఎన్‌జీ సెట్ అవుతుందా లేదా అనే విషయంలో కంపెనీ ఆచితూచి అడుగులు వేస్తోంది. సాధారణంగా డస్టర్ ఒక స్పోర్టీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. సీఎన్‌జీ వల్ల ఆ ఇమేజ్ దెబ్బతినకూడదని ఇంజనీరింగ్ విభాగం భావిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుండి గట్టి డిమాండ్ వస్తే మాత్రం సీఎన్‌జీ వెర్షన్‌ను పరిశీలిస్తామని హిడాల్గో పేర్కొన్నారు. అయితే ఆ వెర్ష‌న్ సాధారణ ఇంజిన్ కాకుండా 'టర్బో సీఎన్‌జీ' అయ్యే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.

Continues below advertisement

అదే ప్ల‌స్ పాయింట్..

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ, డస్టర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో ఇంధన ఖర్చును తగ్గించుకోవాలనుకునే నగరవాసులకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ పవర్, హైబ్రిడ్ వేరియంట్ల మైలేజీ ఈ కారుకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. తాజా బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, రేనాల్ట్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలైందని విశ్లేష‌కులు అంటున్నారు.