Paytm: పేటీయం  పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన చర్య తీసుకుంది. జనవరి 31వ తేదీన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సేవలను ఆర్బీఐ నిషేధించింది. పేటీయం బ్యాంకింగ్ కంట్రోల్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. దీని కారణంగా ఆర్బీఐ ఇంత పెద్ద చర్య తీసుకుంది.


కఠిన చర్యలు తీసుకున్న ఆర్బీఐ
ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య తర్వాత వినియోగదారులు ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం వాలెట్, డిపాజిట్, క్రెడిట్, లావాదేవీ, టాప్-అప్, ఫాస్టాగ్ చెల్లింపు, ఎన్సీఎంసీ కార్డ్‌లు, యూపీఐ, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి అనేక సౌకర్యాలను ఉపయోగించలేరు. అయితే పేటీయం అందించే అన్ని సౌకర్యాలకు ఎండ్ కార్డు పడలేదు.


ఆర్బీఐ ముందుగా పేటీయం పేమెంట్స్ బ్యాంకు సేవలను నిషేధించింది. అంటే ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత కూడా పేటీయం అందించే అనేక ఇతర సేవలు కొనసాగుతాయి. ఈ సేవలన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


పేటీయం ఏం చెప్పింది?
పేటీయంని నడుపుతున్న One 97 Communications Limited సంస్థ పేటీయం యాప్ పనిచేస్తోందని తెలిపింది. పేటీయం అందించే అనేక సేవలు అనేక బ్యాంకులతో భాగస్వామ్యం సహాయంతో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.


గత రెండేళ్లలో పేటీయం ఇతర బ్యాంకులతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని, వాటిని ఇప్పుడు వేగంగా ముందుకు తీసుకువెళతామని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వినియోగదారులకు చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించడానికి దేశంలోని ప్రముఖ థర్డ్ పార్టీ బ్యాంకులతో తమ సంబంధాన్ని విస్తరించనున్నట్లు పేటీయం తెలిపింది. పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఉపయోగించబోమని ఇతర బ్యాంకుల సహాయంతో తమ వినియోగదారులకు సేవలను అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.


ఫాస్టాగ్ పని చేస్తుందా లేదా?
ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఫాస్టాగ్ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో ఇతర బ్యాంకుల సహాయంతో సేవను అందించడానికి ప్రయత్నిస్తామని పేటీయం తన ప్రకటనలో తెలిపింది. త్వరలో దాని గురించి వినియోగదారులను అప్‌డేట్ చేస్తుంది.


పేటీయం మర్చంట్ పేమెంట్ సర్వీస్ పని చేస్తుందా లేదా?
పేటీయం వ్యాపారి చెల్లింపు సేవపై ఎటువంటి ప్రభావం ఉండదు. అంటే పేటీయం ఆఫ్‌లైన్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన పేటీయం క్యూఆర్, పేటీయం సౌండ్‌బాక్స్, పేటీయం కార్డ్ మెషిన్ మునుపటిలా పని చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా కొత్త ఆఫ్‌లైన్ వ్యాపారులకు కూడా కంపెనీ తన సేవలను అందించడం కొనసాగిస్తుంది.


రుణం, బీమా ఈక్విటీ సేవలు పని చేస్తాయా లేదా?
కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఓసీఎల్ రుణ పంపిణీ, బీమా పంపిణీ వంటి ఇతర ఆర్థిక సేవలు పేటీయం పేమెంట్ బ్యాంక్‌కి సంబంధించినవి కావు. ఈ కారణంగా పేటీయం అందించే లోన్, క్రెడిట్ కార్డ్, బీమా వంటి సేవలు భవిష్యత్తులో కూడా పని చేస్తాయి.


ఈక్విటీ సేవల సంగతి ఏంటి?
ఈక్విటీ బుకింగ్ సేవలు పేటీయం మనీ ద్వారా నిర్వహిస్తున్నారు. అందువల్ల దీని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వడం కష్టం. అయితే పేటీయం మనీతో వినియోగదారులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా సురక్షితమైనదని కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఆర్బీఐ తీసుకున్న చర్య పేటీయం మనీ కార్యకలాపాలు లేదా ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌పీఎస్‌లో వినియోగదారులు చేసే పెట్టుబడులను ప్రభావితం చేయదు. పేటీయం మనీ లిమిటెడ్ అనేది సెబీ నియంత్రిత సంస్థ. ఇది పూర్తిగా కట్టుబడి ఉందని కంపెనీ పేర్కొంది.


టికెటింగ్, షాపింగ్, ఆహారం, ఆటల సేవలు పని చేస్తాయా లేదా?
ఈ అన్ని సేవలతో పాటు పేటీయం యాప్‌లో అందుబాటులో ఉన్న టిక్కెట్ బుకింగ్, షాపింగ్, ఆటలు, ఆహారం మొదలైన సేవలు కూడా కొనసాగుతాయి. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి పేటీయం ఇతర బ్యాంకుల సహాయంతో వినియోగదారులకు ఈ సేవలన్నింటినీ అందిస్తుంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!